నిరుపేదలకు పెళ్లికి ముందే కళ్యాణలక్ష్మీ సాయం
హైదరాబాద్: నిరపేద దళిత, గిరిజన యువతుల వివాహాల కోసం రూ. 51 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించే కళ్యాణలక్ష్మీ పథకం నిబంధనలలో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పెళ్లికి ముందే సాయం అందించాలని, నెల రోజులలోపు దరఖాస్తులు స్వీకరించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పథకంపై గత నెల 24న జారీ చేసిన ఉత్తర్వుల్లో పెళ్లి తర్వాత సాయం అందించేలా నిబంధనలు విధించింది.
దీనిని మార్చాలని కే. చంద్రశేఖరరావు ఆదేశించడంతో ఈ మేరకు తాజాగా ఉత్తర్వులిచ్చింది. తాజా నిబంధనల మేరకు తెలంగాణలోని రూ. 2 లక్షలలోపు వార్షిక ఆదాయం గల కుటుంబాలలోని 18ఏళ్ల దాటిన దళిత, గిరిజన యువతులు ఈ పథకానికి అర్హులు.
అక్టోబర్ 2, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. పెళ్లికి నెల రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవా కేంద్రం ద్వారా లేదా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
జనన తేదీ, కుల, ఆదాయ, పదోతరగతి ధ్రువపత్రాలతో పాటు పెళ్లి కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, వివాహ ఖరారు ధ్రువపత్రం చేయాలి. అధికారులు వాటిని పరిశీంచి, నిర్ధారించుకున్న తర్వాతే ఆన్లైన్లో వధువు పేరిట రూ.51వేలను జమ చేస్తారు.
పెళ్లికి కనీసం పది రోజుల మందు సాయం అందించాలని సీఎం కే. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఈ గడువు లోపే దరఖాస్తులపై విచారించి సాయాన్ని అందిస్తారు. కళ్యాణలక్ష్మీ మాదిరే మైనార్టీ వధువులకు రూ. 51వేల ఆర్ధిక సాయం అందించే షాదీముబారక్ పథకంలో నిబంధనలను సవరిస్తూ రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నారు.