తెలుగు టెక్కీలను వీసాలపై అడిగాడు: తర్వాత కాల్చాడు
కాల్పులు జరపడానికి ముందు షూటర్ తెలుగు టెక్కీలను కాన్సాస్లోని బార్లో కొన్ని ప్రశ్నలు వేశాడు. తొలి ప్రశ్నకు జవాబు ఇవ్వకపోవడంతో రెచ్చిపోయాడు.
హైదరాబాద్: కాల్పులు జరపడానికి ముందు తెలుగు టెక్కీలను షూటర్ వారి వీసాల గురించి అడిగాడు. "ఇప్పుడు మీ వద్ద ఏం వీసాలున్నాయి. మీరు ఇక్కడ చట్టవ్యతిరేకంగా ఉంటున్నారా" అని తనను, తన మిత్రుడిని షూటర్ అడిగినట్లు కాల్పుల్లో గాయపడిన ఆలోక్ మాడసాని ద న్యూయార్క్ టైమ్స్తో చెప్పాడు.
ఆ ప్రశ్నలకు తాము స్పందించలేదని అన్నారు. తాను, శ్రీనివాస్ కూచిభొట్ల బార్లో కూర్చున్నామని, అక్కడికి ఆడం పురింటన్ వచ్చాడని చెప్పారు. తమపక్కనే అతను కూర్చున్నాడని తెలిపారు. "ప్రస్తుతం మేం ఏ వీసాతో ఇక్కడ ఉన్నామో చెప్పమని అతను అడిగాడు, చట్టవిరుద్ధంగా ఉంటున్నామేమో చెప్పమన్నాడు" అని మాడసాని వివరించారు.
ఆ ప్రశ్నలకు తాము సమాధానం ఇవ్వలేదన్నారు. కొందరు తెలివితక్కువ పనులు చేస్తూ ఉంటారని, ఇతను ఆ స్థాయి దాటి ముందుకు వెళ్ళాడని చెప్పారు. శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాడసాని అమెరికాలో ఎంఎస్ చేసి, అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిద్దరూ చట్టబద్ధంగానే అమెరికాలో ఉంటున్నారు.
కాన్సాస్లోని ఓ బార్లో హంతకుడు జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల మరణించిన విషయం తెలిసిందే. అతని మిత్రుడు మాడసాని ఆలోక్ గాయపడ్డాడు.
అమెరికాలో హత్యకు గురైన కూచిబోట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. కేటీఆర్ వెంట మంత్రి మహేందర్రెడ్డి, ఎంపీలు మల్లారెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు ఉన్నారు.