పెద్ద స్కాం: శివాజీ, 'అగ్రిగోల్డ్'పై పర్సెంటేజ్ పెంచమని సి1, ముందు అమ్మి పెట్టండి: హైకోర్టు
హైదరాబాద్/విజయవాడ: అగ్రిగోల్డ్ కేసును సిబిఐకు అప్పగించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు కారెం శివాజీ గురువారం నాడు డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ మోసానికి 38 మంది లక్షల డిపాజిటర్లు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
మొత్తం 28 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ఖాతాదారుల జాబితాను హైకోర్టుకు ఎందుకు సమర్పించడం లేదో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ చైర్మన్, డైరెక్టర్లను అరెస్టు చేయాలన్నారు.
ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న అక్రమార్కులను ఉరి తీయాలని కారెం శివాజీ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధిక వడ్డీల ఆశ చూపుతూ పేద, మధ్య తరగతి కుటుంబాలను ముంచుతున్న నేరగాళ్లకు ఉరి శిక్షే సరైందన్నారు.
జనం నెత్తిన కుచ్చుటోపీ పెట్టి అగ్రిగోల్డ్ యాజమాన్యం వందల కోట్లను లాగేస్తే, ఆ సంస్థ నుంచి తక్కువ ధరలకు ఆస్తులను కొనుగోలు చేసిన వారిని కూడా ఉపేక్షించరాదన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారాలతో సంబంధం ఉన్న, ఆ సంస్థ నుంచి గుట్టుచప్పుడు లేకుండా ఆస్తులు కొన్న వారి రెండో జాబితాను విడుదల చేశారు.
అగ్రిగోల్డ్ యాజమాన్యానికి హైకోర్టు నో
వరుస మీడియా కథనాలతో అగ్రిగోల్డ్ ఆస్తులను కొనేందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదని అగ్రిగోల్డ్ యాజమాన్యం గురువారం నాడు హైకోర్టుకు తెలిపింది. మీడియాలో అగ్రిగోల్డ్ వార్తలను అడ్డుకోవాలని హైకోర్టును యాజమాన్యం కోరింది.
దీనిపై హైకోర్టు స్పందిస్తూ... ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని చెప్పింది. మరోవైపు, అగ్రిగోల్డ్ యజమానుల బినామీ ఆస్తుల చిట్టాను బాధితులు ఈ రోజు కోర్టుకు సమర్పించారు. కోర్టు విచారణను మధ్యాహ్నానానికి వాయిదా వేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వనుంది.
తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, తమిళనాడుకు చెందిన లక్షలాది మంది మద్య తరగతి జనానికి అధిక వడ్డీలు ఆశ చూపి వందల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో సేకరించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం మెచ్యూరిటీ తీరిన డిపాజిట్లను చెల్లించడంలో చేతులెత్తేసిన విషయం తెలిసిందే.
అగ్రిగోల్డ్ ఆస్తుల విచారణ సోమవారానికి వాయిదా
అగ్రిగోల్డ్ ఆస్తుల విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను అమ్మేందుకు సీ1 సంస్థ ముందుకు వచ్చింది. సీ1 సంస్థకు 0.2 కమిషన్ ఇవ్వాలని హైకోర్టు సూచించింది. కమిషన్ను 0.2 నుంచి 0.5కు పెంచాలని సీ1 సంస్థ కోరింది.
తొలుత ఆస్తులు అమ్మాలని హైకోర్టు సూచించింది. మదుపరుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. సోమవారం నిర్ణయం చెబుతామని సీ1 సంస్థ తెలిపింది. అలాగే, అగ్రిగోల్డ్ భూముల అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ ముందుకు వచ్చింది.