గర్ల్ప్రెండ్స్తో జల్సాల కోసం చైన్ స్నాచింగ్: ఆట కట్టించిన పోలీసులు
హైదరాబాద్: ఎట్టకేలకు చైన్ స్నాచర్లను పట్టుకోవడంలో కరీనంగర్ పోలీసులు సఫలమయ్యారు. వారివద్ద నుంచి పోలీసులు రూ.20 లక్షల విలువైన 50 తులాల బంగారం, 11 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన నేదునూరి శ్రావణ్కుమార్, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల హమాలివాడకు చెందిన తొంగరి రాము, పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటకు చెందిన బొకరి సునీల్రాజ్ ముగ్గురు స్నేహితులు. శ్రావణ్, రాము పెద్దపల్లిలో, సునీల్రాజ్ కరీంనగర్లోని గణేశ్నగర్లో నివాసముంటున్నారు.
చిన్న చిన్న పనుల ద్వారా వచ్చే డబ్బులతో గర్ల్ప్రెండ్స్తో కలిసి జల్సాలు చేయడం ఇబ్బందిగా మారడంతో చైన్ స్నాచింగ్ మొదలెట్టారు. ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్గా వారి మెడల్లోని చైన్లు లాక్కొని పారిపోయేవారు. అంతేకాదు పెద్దపల్లిలో ఉంటూ బస్సుల్లో కరీంనగర్కు వచ్చి రాత్రివేళ నెంబర్లేని బైక్లను గుర్చించి దొంగతనం చేసేవారు.
ఆ మరుసటి రోజు ఉదయాన్నే ముగ్గురూ కలిసి రెక్కీ నిర్వహించి ప్లాన్ ప్రకారం ఒంటరిగా ఉన్న మహిళలపై చోరీలకు పాల్పడేవారు. ముగ్గురు కూడా మూడు ముఠాలుగా ఏర్పడి చోరీలు చేసేవారు. అనంతరం వారు బైక్ను ఎక్కడన్నా వదిలేసి వెళ్లిపోయేవారు.
ఇలా కరీంనగర్ పట్టణంతో పాటు సుల్తానాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. వచ్చిన డబ్బులు జల్సాలకు ఖర్చుచేసేవారు. ఈ ముఠాపై ఇప్పటి వరకు 30 కేసులు నమోదయ్యాయి. వీరిని పట్టుకునేందుకు కరీంనగర్ టౌన్లోనే 15 బృందాలు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 4న నగరంలోని విద్యానగర్లో చైన్స్నాచింగ్ చేసి పారిపోతున్న వీరిని టూటౌన్ పోలీసులు వెంబడించి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
విచారణలో కరీంనగర్లో టూటౌన్ పరిధిలో 11 నేరాలు, 9 చైన్స్నాచింగ్లు, 6 బైక్లు, త్రీటౌన్ పరిధిలో 6 చైన్ స్నాచింగ్లు, వన్టౌన్ పరిధిలో 1 చైన్స్నాచింగ్, సుల్తానాబాద్ పీఎస్ పరిధిలో 2 చైన్స్నాచింగ్లు, 1 బైక్, మంచిర్యాల పీఎస్ పరిధిలో 1 చైన్స్నాచింగ్, 1 బైక్ చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు.
వీరి నుంచి రూ.15 లక్షల విలువైన 50 తులాల బంగారం, రూ.5 లక్షల విలువైన 11 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 86 చైన్స్నాచింగ్ కేసులు నమోదు కాగా వీటిలో 85 శాతం వరకూ రికవరీ చేశామని ఎస్పీ జోయల్ డేవిస్ తెలిపారు. మిగతా కేసులను కూడా త్వరలోనే ఛేదిస్తామని చెప్పారు.