చంద్రబాబు వల్లే, ఇప్పటికీ: కవిత ఆగ్రహం, కొత్త విషయం చెప్పట్లేదు: జితేందర్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం నాడు పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. అదే సమయంలో కేంద్రం సహకరించడం లేదని విమర్శించారు.
ఆమె వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి సదానంద గౌడ కూడా కవిత వ్యాఖ్యలతో విభేదించారు. కవిత వ్యాఖ్యలను టిడిపి ఎంపీ మాల్యాద్రి తీవ్రంగా ఖండించారు.
కవిత మాట్లాడుతూ... కేంద్రం హైకోర్టు విభజన పైన సహకరించడం లేదన్నారు. హైకోర్టు విభజనను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ పైన ఇప్పటికీ అజమాయీషి కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేంద్రం కూడా కావాలనే సహకరించడం లేదన్నారు.
హైకోర్టు విభజన రాజకీయంగా ముడివడి ఉందన్నారు. చంద్రబాబు తమ పాలనకు ఎప్పుడూ అడ్డమేనని కవిత మండిపడ్డారు. అయితే, కవిత వ్యాఖ్యలనుటిడిపి ఎంపీలు తీవ్రంగా ఖండించగా, న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ విభేదించారు.
కొత్త విషయం చెప్పడం లేదు: జితేందర్ రెడ్డి
కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ హైకోర్టు పైన కొత్త విషయం ఏమీ చెప్పడంలేదని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం హైకోర్టును విభజించాలని కోరారు. కేంద్రం దీని పైన సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.
అనుకుంటే రాత్రికి రాత్రే హైకోర్టును ఏర్పాటు చేయవచ్చునని, ఇది పెద్ద సమస్య కాదన్నారు. ఏపీకి హైకోర్టుకు ఏర్పాటు చేస్తామంటే వసతులు హైదరాబాదులోనే ఏర్పాటు చేస్తామని తాము ఇదివరకే చెప్పామని జితేందర్ రెడ్డి అన్నారు.