జూన్ 2న కేసీఆర్ పుల్ బిజీ: 'ఎంజాయ్ చెయ్యడానికి ఫామ్హౌస్కు వెళ్లడం లేదు'
హైదరాబాద్: తానేమీ ఎంజాయ్ చేయడానికి ఫామ్ హౌస్కు వెళ్లడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆయన ఓ దినపత్రికకు ఇంటర్యూ ఇచ్చారు. ఈ ఇంటర్యూలో ఎప్పుడు ఖాళీ దొరికినా గజ్వేల్ సమీపంలోని ఎరవెల్లి ఫామ్హౌస్కు ఎందుకు వెళతారన్న ప్రశ్న ఎదురైంది.
ఈ ప్రశ్నకు కేసీఆర్ చాలా తెలివిగా సమాధానం చెప్పారు. అదేమీ ఫామ్ హౌస్ కాదని, తన ఇల్లు అంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్ అక్కడ వ్యవసాయం కూడా చేస్తున్నానని అన్నారు. తన నియోజకవర్గం కూడా అదేనని, అక్కడికి వెళితే, నియోజకవర్గ ప్రజల బాధలను తెలుసుకునే అవకాశం దొరుకుతుందని చెప్పారు.
అక్కడకు వెళ్లినప్పుడు అక్కడి నుంచే ప్రభుత్వ పనులను చూస్తుంటానని చెప్పుకొచ్చారు. తన కుటుంబంతో గడిపే సమయం తక్కువేనని చెప్పిన కేసీఆర్, గత మూడు దశాబ్దాలుగా ఇంట్లో వాళ్లు నాతో సర్దుకు పోయారని చెప్పారు. ఏ రాజకీయ నేత కూడా తన కుటుంబానికి న్యాయం చేయలేడని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
జూన్ 2న కేసీఆర్ షెడ్యూల్ ఖరారు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2)న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ ఖరారైంది. ఆరోజు ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని రోజంతా బిజీగా గడపనున్నారు. ఉదయం 9:30 గంటలకు కేసీఆర్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ముందుగా అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులు అర్పిస్తారు.
ఆ తర్వాత 9:45 గంటలకు లుంబినీ పార్కులో అమరవీరుల మెమోరియల్కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 10:10కి సంజీవయ్య పార్కులో 303 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 10:30 గంటల నుంచి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా అమరవీరుల కుటుంబాలను సత్కరించనున్నారు. పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్ కూడా పాల్గొంటారు. ఇక సాయంత్రం హుస్సేన్ సాగర్ తీరంలో సాయంత్రం జరిగే ఆవిర్భావ ఉత్సవాల్లో సైతం కేసీఆర్ పాలు పంచుకుంటారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది.