ఇలాగేనా: అధికారులపై కేటీఆర్ ఆగ్రహం, కేసీఆర్ ఏరియల్ సర్వే (పిక్చర్స్)
కరీంనగర్: వర్షాల దృష్ట్యా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తాజా పరిస్థితిపై ఆదివారం నాడు సమీక్ష చేపట్టారు. ఆయన మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు ఆదేశాలు జారీ చేశారు.
మున్సిపాలిటీల్లోని చెరువులు, నాలాల పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ఆదేశించారు. వీటి వల్ల వర్షపు నీరు నిలిచి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిథిలావస్థలో ఉన్న పాడుబడ్డ, పాత భవనాలను కూడా కూల్చి వేయాలన్నారు. అవి కూలితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.
కేసీఆర్ ఏరియల్ సర్వే
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం నాడు ఏరియల్ సర్వే నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో ఆయన వర్షాల కారణంగా ఏర్పడిన పరిస్థితులను సమీక్షించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టులను పరిశీలించారు. అధికారులతో సమీక్ష అనంతరం హైదరాబాద్ పయనమయ్యారు.
కావాల్సినంత వర్షం
తెలంగాణలో వర్షాలు కావాల్సినంతగా కురిశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అన్నారు. రాబోయే రోజుల్లో కరువు అనేదే ఉండదన్నారు. ప్రజలు వానలను చూసి చాలా సంతోషిస్తున్నారన్నారు. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లాలో మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలను పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మిడ్ మానేరు కట్ట తెగింది
నిజాం సాగర్ నుంచి 90 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉందని చెప్పారు. మిడ్ మానేరుకు వరద వల్ల కట్ట తెగి నీళ్లు ప్రవహించాయని కేసీఆర్ చెప్పారు. మిడ్ మానేరు ఎడమ వైపు పనులు పూర్తి కాకపోవడంతో వరద నీరు ప్రవహించిందని తెలిపారు.
ముందస్తు జాగ్రత్తలు
ముందు జాగ్రత్తగా ఈ మిడ్ మానేరు కింద ఉన్న గ్రామాల నుంచి పన్నెండు వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారని కేసీఆర్ తెలిపారు. వారికి పునరావాస కేంద్రాల్లో నీళ్లు, ఆహారం అందిస్తున్నారన్నారు. మిడ్ మానేరు ఇద్దరకు కాంట్రాక్టర్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నామన్నారు. త్వరలో దీనికి టెండర్లు పిలుస్తామన్నారు.
శ్రీశైలంకు వరద
ఎల్ఎండీ నిండిందని ఇంకా మరో మూడు టీఎంసీల నీరు నిండాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. జూరాల నిండిపోయి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వస్తోందన్నారు. అలమట్టి, నారాయాణపూర్ జలాశయాలకు వరద వస్తోందని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం పెద్దగా జరగలేదన్నారు.
ఏరియల్ సర్వే
ఏదైనా పిడుగుపాటు ఇలాంటివి జరిగాయని కేసీఆర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల నష్టపరిహారం అందిస్తామన్నారు. జూరాల నిండిపోయి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వస్తుందన్నారు. అధికారులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి విపత్తు సంభవించకుండా చూసుకోవాలని సూచించారు. అంతకు ముందు ఆయన మిడ్ మానేరు, ఎల్లంపల్లి పరిసరాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
ఏడుపాయల కూలీల కథ సుఖాంతం
ముఖ్యమంత్రి చొరవతో ఏడుపాయల కూలీల కథ సుఖాంతమైంది. ఏడుపాయల వద్ద కూలీలు శనివారం నాడు వరదలో చిక్కుకున్నారు. సహాయ చర్యల కోసం ఇప్పటికే సైన్యాన్ని, ఎన్డీఆర్ఎఫ్ను రంగంలోకి దించారు. అనంతరం ఏడుపాయల వద్ద వరదముట్టడిలో చిక్కుకున్న కూలీలను రక్షించడానికి హెలికాఫ్టర్లను పంపించారు.
ఏడుపాయల కూలీలు సురక్షితంగా బయటపడ్డారు.
ఘనపూర్ ఆనకట్ట వద్ద రెండు పాయలుగా ప్రవహిస్తున్న వరదలో చిక్కుకున్న ఒరిస్సా, మహారాష్ట్రకు చెందిన 24మంది కూలీలను ఆదివారం ఉదయం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. శనివారం సాయంత్రమే ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్లను అక్కడికి వెళ్లాలని, ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఏడుపాయలలోనే ఉండాలని చెప్పారు.
కూలీలను రక్షించేందుకు రంగంలోకి హెలికాప్టర్
వరదలో ఘనపూర్ ఆనకట్ట ఆవలివైపు చిక్కుకున్న కూలీలను రక్షించడానికి హెలికాప్టర్లను రంగంలోకి దింపారు. అయితే శనివారం సాయంత్రం కారుమబ్బులు కమ్ముకుని ప్రతికూల వాతావరణం ఉండటంతో అది సాధ్యపడలేదు. దీనితో ఎన్డీఆర్ఎప్ బృందాన్ని రంగంలోకి దించారు. కానీ వరద ఉధృతి తీవ్రంగా ఉండటం.. అప్పటికే చీకటి కూడా పడటంతో రెస్క్యూ ఆపరేషన్ ముందుకు సాగలేదు. అయితే ఎన్డీఆర్ఎప్ బలగాలు అక్కడే మకాం వేశాయి. రాత్రి పొద్దుపోయే వరకు పరిస్థితిని సమీక్షించిన సీఎం ఎయిర్ ఫోర్స్ అధికారులతో మాట్లాడి ఆదివారం ఉదయం హెలికాప్టర్ చేరేలా చర్యలు తీసుకున్నారు. కూలీలు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
కేసీఆర్ సంతోషం
ప్రస్తుత వర్షాలతో రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లాగా మారుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాడు సంతోషం వ్యక్తం చేశారు. కరువుతీరా వానలతో ప్రజలు ఆనందంతో ఉన్నారన్నారు. ఏకధాటి వానలవల్ల రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టంకూడా పెరుగుతుందన్నారు.
జాగ్రత్త
ప్రాజెక్టుల నుంచి నుంచి నీరు విడుదల చేస్తున్నప్పుడు, చెరువులు అలుగు పోస్తున్నపుడు ఆ దృశ్యాలను చూడటానికి వెళ్లే సందర్శకులు చాలా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. జలాశయాల వద్ద నిర్లక్ష్యంగా ఉండి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు.
మిడ్ మానేరుకు కొత్తగా టెండర్లు
మధ్య మానేరు నిర్మాణంలో జాప్యం జరిగినందువల్లనే వరదలతో తీవ్రనష్టం కలిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దీంతో ఆ టెండర్లను రద్దుచేసి కొత్త టెండర్లను పిలవాలని అధికారులను ఆదేశించారు.
భారీ వరద నీరు వల్లే
ఎగువ మానేరు నుంచి భారీస్థాయిలో వరదనీరు రావడం వల్లనే మధ్య మానేరుపై తీవ్ర ప్రభావం పడిందని కేసీఆర్ అన్నారు. భవిష్యత్తులో నాణ్యత గల పనులు చేపట్టేందుకు 5శాతం కంటే తక్కువ టెండర్లు వేసిన గుత్తేదార్లను పనులకు అనుమతించొద్దని ఆదేశించారు.
భద్రాచలం, రామన్నపేట వద్ద అప్రమత్తంగా ఉండాలి
గోదావరిలో వరద అధికంగా ఉన్న దృష్ట్యా వరంగల్ జిల్లా రామన్నపేట, ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదల వల్ల కలిగిన నష్టంపై అధికారులు వెంటనే అంచనాలను రూపొందించి.. బాధితులకు పరిహారం వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.