"కెటిఆర్ పొలిటికల్ ఎంట్రీకి కెసిఆర్ నో: భేటీకి నో చెప్పారు"
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయుడు, మంత్రి కెటి రామారావుపై తెలంగాణ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆసక్తికరమైన విషయం చెప్పారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయుడు, మంత్రి కెటి రామారావుపై తెలంగాణ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆసక్తికరమైన విషయం చెప్పారు. కెటిఆర్ రాజకీయాల్లోకి రావడం కెసిఆర్కు అసలు ఇష్టమే లేదని ఆయన చెప్పారు.
మంత్రి కేటీఆర్ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కుమారుడిగా ఎదగలేదని, ఆయన రాజకీయ ప్రవేశాన్ని సీం కేసీఆర్ వ్యతిరేకించారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఒక దశలో కేటీఆర్కు బీ ఫారం ఇచ్చేందుకు కూడా కేసీఆర్ సందేహించారని తెలిపారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ ఢిల్లీలో ఉన్నపుడు కేటీఆర్కు రెండు రోజులపాటు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. కేసీఆర్ కుమారుడు కావడం వల్లనే కేటీఆర్కు మంత్రి పదవి వచ్చిందంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శించడాన్ని కర్నె తప్పుబట్టారు.
మూడో రోజు అవకాశం...
మూడోరోజు కెటిఆర్ను కలిసేందుకు అవకాశమిచ్చిన కేసీఆర్.. "ఎప్పుడొచ్చావు రామూ.. అని అడిగారే తప్ప మరోమాట మాట్లాడలేదు.. ఇంకో విషయం ఏమంటే.. ఎమ్మెల్యేగా పోటీకి బీఫారం కూడా ఇవ్వడానికి ఆయన సుముఖత చూపలేదు" కర్నె ప్రభాకరర్ అన్నారు.
Recommended Video
రూ. 4 లక్షల జీతం వదులుకుని...
కేటీఆర్ నెలకు రూ.4లక్షల జీతం వదులుకొని తెలంగాణ ఉద్యమం కోసం, తన తండ్రి కష్టంలో పాలుపంచుకొనేందుకు వచ్చారని కర్నె ప్రభాకర్ చెప్పారు. బంజారాహిల్స్లోని తాజ్కృష్ణలో సోమవారం ప్రభుత్వ డిజిటల్ మీడియా, ఐటీ, ఈసీ విభాగాల డైరెక్టర్ దిలీప్ కొణతం రచించిన ‘ఫ్యూచర్ పర్ఫెక్ట్ కేటీఆర్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఆ విషయాలు చెప్పారు.
ట్రెండ్ సృష్టించారు...
సోమవారం మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన రాజకీయ ప్రస్థానంపై కొణతం దిలీప్ రాసిన ‘ఫ్యూచర్ పర్ఫెక్ట్ - కేటీఆర్' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కేటీఆర్ రాజకీయాల్లోకి రాలేదని, సామాన్య కార్యకర్తలా ఉద్యమంలో పాల్గొని ఎదిగారని అన్నారు. మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ కేటీఆర్ ఒక విధానంతో రాజకీయాల్లోనే ట్రెండ్ సృష్టించారన్నారు.
అన్నయ్య పుట్టిన రోజు కవిత....
రాఖీ పండుగను వినూత్నంగా జరుపుకునేలా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత సిస్టర్స్ ఫర్ ఛేంజ్- గిఫ్ట్ ఏ హెల్మెట్పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. "మా అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. దేశంలోని సోదరులందరి సంక్షేమం కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ద్విచక్ర వాహన ప్రమాదాల్లో నిత్యం 400 మంది మరణించడం చాలా బాధిస్తున్నది. ప్రమాదాల బారి నుంచి సోదరులను కాపాడుకునేం దుకు రాఖీ పండుగ సందర్భంగా సోదరులకు హెల్మెట్లను గిఫ్ట్గా ఇచ్చే కార్యక్రమంలో సోదరీమణులు కలిసిరావాలి" అని ఎంపీ కవిత ట్వీట్చేశారు.