ఆ విషయంలో టీఆర్ఎస్ సూపర్ సక్సెస్, నచ్చకపోతే జనమే ఓట్లేయరు: కేసీఆర్
ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నట్లు ముందే ఎన్నికలు రావని అన్నారు. విపక్షాలు అప్పుడే ఎందుకు తొందరపడుతున్నాయని ప్రశ్నించారు. ప్రజలంతా ఇప్పుడు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారని,
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ పై చర్చ సందర్బంగా విపక్షాల విమర్శలను సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. రాష్ట్ర ప్రగతి విషయంలో విపక్షాలు చేస్తున్న వాదన అవగాహనరాహిత్యమని అన్నారు. తాజా బడ్జెట్ పై అన్ని కులవృత్తుల వారు సంబరాలు చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.
గ్రామీణ కులవృత్తులను పరిపుష్టం చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, విపక్షాలు మాత్రం దీన్ని జీర్ణించుకోలేక పోతున్నాయని కేసీఆర్ విమర్శించారు. యాదవులకు ఇచ్చే సబ్సిడీ పథకంలో కేంద్రం డబ్బు లేదని ఈ సందర్బంగా కేసీఆర్ విపక్షాలకు గుర్తుచేశారు. గొర్రెల పంపకం పథకం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు. కొత్త రాష్ట్రానికి మనమే శాపనార్థాలు పెట్టుకోవద్దని సూచించారు.
ఇక విద్యుత్ గురించి ప్రస్తావిస్తూ.. ప్రజా అవసరాలు, పరిశ్రమలు, రైతులకు నిరంతర సరఫరా చేయాలన్న ఉద్దేశంతో రాబోయే అవసరాలను ముందే గుర్తించి విద్యుత్ కొనుగోలు చేశామన్నారు. విద్యుత్ సరఫరాలో గత కాంగ్రెస్ పార్టీ అట్టర్ ప్లాఫ్ అయిందని, కానీ తాము సూపర్ సక్సెస్ అయ్యామని కేసీఆర్ అన్నారు.
రెండు డిస్కంలకు రూ.12వేల కోట్లు చెల్లించామని, డిస్కంలు చార్జీలు పెంచుదామన్న ప్రస్తావన తెస్తే.. తానే వద్దని చెప్పానని కేసీఆర్ తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నట్లు ముందే ఎన్నికలు రావని అన్నారు. విపక్షాలు అప్పుడే ఎందుకు తొందరపడుతున్నాయని ప్రశ్నించారు. ప్రజలంతా ఇప్పుడు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారని, పాలన సరిగా లేకపోతే జనం ఓటేసే పరిస్థితిలో లేరని చెప్పారు.
అప్పుల గురించి విపక్షాలు చేస్తున్న విమర్శలపై కేసీఆర్ ఈ సందర్బంగా జవాబిచ్చారు. రాష్ట్రాభివృద్ధికి అప్పులు చేయడమనేది తప్పనిసరి అని.. అప్పులు చేయడం తీర్చడమన్నది నిరంతర ప్రక్రియని స్పష్టం చేశారు.
అదే సమయంలో కొత్త జిల్లాల పెంపుపై వస్తున్న అనుమానాలపై కేసీఆర్ స్పష్టతనిచ్చారు. జిల్లాల పెంపుపై కేంద్రం సానుకూలంగా లేదని మీడియా అత్యుత్సాహంతో కథనాలు రాస్తోందన్నారు. జిల్లాల పెంపుపై అనుమానాలను రేకెత్తిస్తూ వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదన్నారు.జిల్లాల పెంపు పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని.. ఎటువంటి ఆధారం లేని వార్తలను అసెంబ్లీలో ప్రస్తావించడం సరికాదని కేసీఆర్ సూచించారు.