లంచం వద్దన్న కానిస్టేబుల్: కెసిఆర్ అభినందన
హైదరాబాద్: నీతి కోసం నిలబడిన ఓ సాధారణ కానిస్టేబుల్ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు దృష్టిని ఆకర్షించాడు. ఓ ఇంటి యజమాని ఇవ్వజూపిన లంచాన్ని ఆ కానిస్టేబుల్ సుతారంగా తిరస్కరించాడు. తాను బాధ్యతగల ఉద్యోగినని, ప్రభుత్వం తనకు ఇస్తున్న జీతం సరిపోతుందని, లంచాలు అక్కర్లేదని తన నిజాయితీని చాటుకున్నాడు ఆ కానిస్టేబుల్ నారాయణ రావు.
హైదరాబాద్ వెస్ట్ జోన్ స్పెషల్ బ్రాంచి పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ జి నారాయణరావువిధి నిర్వహణలో భాగంగా పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం శనివారం ఉదయం జూబ్లీహిల్స్ రోడ్నెంబర్ పరిధిలోని ఓ దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లారు. వివరాల సేకరణ పూర్తయ్యాక వెనుదిరిగిన కానిస్టేబుల్కు దరఖాస్తుదారు తండ్రి కొంత డబ్బు ఇవ్వబోయారు. అయితే కానిస్టేబుల్ దానిని తిరస్కరించారు.
ప్రభుత్వం తమ జీతాలను పెంచిందని, తమ బాగోగుల్ని సిఎం బాగానే చూస్తున్నారని, లంచాలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో దరఖాస్తుదారు తండ్రి ఆశ్చర్యపోయారు. కానిస్టేబుల్ను అభినందించడమే కాకుండా ఈ విషయాన్ని నారాయణరావు వెళ్లిపోయాక, ముఖ్యమంత్రి కెసిఆర్కు ఫోన్ చేసి చెప్పారు. దాంతో ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం కానిస్టేబుల్ నారాయణరావును తన క్యాంపు ఆఫీసుకు పిలిపించి అభినందించారు.
నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి, ఎస్బి జాయింట్ కమిషనర్ నాగిరెడ్డి తదితర అధికారులు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. నిజాయితీగా వ్యవహరిస్తూ పోలీసు శాఖ గౌరవం ఇనుమడింపజేశావంటూ అక్కడే ఉన్న మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపి కె కేశవరావుకూడా కానిస్టేబుల్ను అభినందించారు.