కేసీఆర్కు అరుదైన గౌరవం: ప్రతిష్టాత్మక వ్యవసాయ నాయకత్వ అవార్డుకి ఎంపిక..
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ కేసీఆర్ పేరును ఈ అవార్డుకు ప్రతిపాదించింది.
హైదరాబాద్: చాలామంది రైతు బిడ్డను అని చెబుతుంటారు కానీ తాను స్వయంగా రైతును అని సీఎం కేసీఆర్ పలు సందర్బాల్లో చెప్పారు. ఒకవిధంగా కేసీఆర్ అంటే ఫాం హౌజ్, ఫాం హౌజ్ అంటే కేసీఆర్ అని గుర్తుకొచ్చేంతలా వ్యవసాయంతో ఆయనకు అనుబంధం ఉంది.
ఇప్పుడిదంతా ఎందుకంటే.. వ్యవసాయ రంగంలో కేసీఆర్ చేసిన కృషిని గుర్తిస్తూ.. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. ఇదొక అరుదైన గౌరవం అనే చెప్పాలి.
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ కేసీఆర్ పేరును ఈ అవార్డుకు ప్రతిపాదించింది. సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి 7.30గం.కు ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ వ్యవసాయ నాయకత్వ సదస్సులో కేసీఆర్కు ఈ అవార్డును అందజేయనున్నారు. గ్రామీణాభివృద్ధికి పాటుపడుతున్న వ్యక్తులకు 2008 నుంచి భారత ఆహార, వ్యవసాయ మండలి ఈ అవార్డును అందజేస్తోంది.