కెసిఆర్కు 'కవిత' సాయం చిక్కులు, 'సర్పంచ్లా తిరుగుతున్న సీఎం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం నాడు భగ్గుమన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాలకు సర్పంచ్గా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమారుడిలా మాట్లాడుతున్నారన్నారు. రైతాంగ సమస్యలను కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు ఏనాడు పట్టించుకోలేదన్న కవిత.. తన స్థాయికి మించి మాట్లాడుతున్నారన్నారు.
కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ గౌడ్, దాసోజు శ్రవణ్, ఆకుల లలిత, సంపత్ కుమార్ తదితరులు వేర్వేరుగా కవిత పైన మండిపడ్డారు.
జాగృతి సంస్థ ద్వారా ప్రభుత్వ పరిహారం పరిధిలోకి రాని 389 మంది ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పెన్షన్ ఇస్తామని ప్రకటించడం ద్వారా కెసిఆర్కు పాలన చేతకాదని కుమార్తె అంగీకరించారని దాసోజు శ్రవణ్ అన్నారు.
జాగృతికి గ్రామాల దత్తత, బతుకమ్మల పేరిట ఎన్ని విరాళాలు వచ్చాయో, అందులో ఎంత ఖర్చు చేస్తున్నారో లెక్క చెప్పాలన్నారు. కెసిఆర్ రాష్ట్రానికి సిఎంననే విషయం మరిచి ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు సర్పంచిగా తిరుగుతున్నారన్నారు.
తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యోగ, న్యాయవాదులు, వైద్యులు, మేధావుల జేఏసీలకు రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా అని నిలదీశారు. వారు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. తండ్రి, కుమార్తె కలిసి రైతు ఆత్మహత్యలను డ్రామాకా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.