కెసిఆర్కు సవాళ్ల మీద సవాళ్లు: టిడిపి చిత్తు, ఆ కేసే మలుపు తిప్పిందా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి వరుసగా ఎన్నికల సవాళ్లను ఎదుర్కుంటున్నారు. దానికితోడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నుంచి, ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్రమైన విమర్శలనే ఎదుర్కుంటూ వచ్చారు.
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని తెలంగాణ ఉద్యమ కాలంలో చెప్పిన మాటను జవదాటి ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. దానిపై ఆయన మీద తీవ్రమైన విమర్శలే వచ్చాయి, వస్తున్నాయి. ఆ విమర్శలను పట్టించుకోవాల్సినంత అవసరం లేకుండా ఆయన ముందుకు దూసుకుని వెళ్తున్నారు. తాజాగా, ఆయన హైదరాబాద్పై గులాబీ జెండా ఎగురేసి, అతి పెద్ద సవాల్ను ఎదుర్కుని విజయం సాధించారు.
అటు జగన్, ఇటు కెటిఆర్: బాబు రిస్క్ చేశారా, నారా లోకేష్ ఎదుర్కోగలరా?
నిజానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి, దాని అధినేత చంద్రబాబు నుంచీ ఎప్పటికప్పుడు సవాల్ ఎదురవుతూనే వచ్చింది. తెరాసను ఎదుర్కుని, కెసిఆర్ ప్రాబల్యాన్ని అడ్డుకోగల నేతగా తెలంగాణలో కూడా చంద్రబాబును చూసిన సందర్బాలు ఉన్నాయి. కెసిఆర్ కన్నా మించిన పాలనాదక్షుడిగా, వ్యూహకర్తగా, రాజకీయ చతురడిగా చంద్రబాబు పేరు సంపాదించుకున్నారు.
కెసిఆర్ ఉద్యమాన్ని నడిపించారే గానీ అధికార రాజకీయాలను నడపలేరనే వారికి సమాధానం ఇస్తూ వెళ్లారు. సాధారణ ఎన్నికల్లో అటు పార్లమెంటుకు, ఇటు శాసనసభకు పోటీ చేసి, పార్లమెంటు సీటును వదులుకున్నారు. దాంతో సిద్ధిపేట లోకసభ స్తానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
అంతేకాకుండా, వరంగల్ లోకసభ స్థానం నుంచి విజయం సాధించిన కడియం శ్రీహరిని రాష్ట్రానికి తెచ్చి, ఉప ముఖ్యమంత్రిని చేసి వరంగల్ లోకసభకు ఉప ఎన్నికను ఆహ్వానించారు. ఈ రెండు ఎన్నికల్లో తెరాసను దెబ్బ తీయడానికి ప్రతిపక్షాలు తీవ్రంగానే ప్రయత్నించాయి. కానీ, గతంలో కన్నా భారీగా ఈ రెండు ఎన్నికల్లో తెరాస విజయం సాధించింది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ఎదుర్కున్నారు. నిజానికి, ఈ ఎన్నికలు కెసిఆర్ను దెబ్బ తీస్తాయని భావించారు. సీమాంధ్ర ఓటర్లు అధికంగా ఉండడం, చంద్రబాబుపై హైదరాబాద్ ప్రజలకు సానుకూల వైఖరి ఉండడం వల్ల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కెసిఆర్ను తీవ్రంగా దెబ్బ తీస్తాయని అనుకున్నారు. గత ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెసు, మజ్లీస్ దాదాపు సమానమైన సీట్లను పంచుకుంటే, ఈ ఎన్నికల్లో కాంగ్రెసు, టిడిపిలను చావు దెబ్బ తీసి ఏకైక పెద్ద పార్టీగానే కాకుండా సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే పార్టీగా తెరాస అవతరించింది.
ఇక, నారాయణఖేడ్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక కూడా కెసిఆర్కు నల్లేరు మీద నడకే అంటున్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం పావులు కదుపుతూ వచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఓ వైపు, ఇతర పార్టీల శాసనసభ్యులనూ నాయకులనూ ఒక్కరొక్కరినే పార్టీలోకి తీసుకుంటూ బలోపేతం అవుతూ వచ్చారు.
అయితే, ఇతర పార్టీలవాళ్లు వచ్చినప్పుడు పాత నాయకులు అసంతృప్తికి గురి కావడం సహజం. కానీ పార్టీ నాయకుల మధ్య సమన్వయం సాధిస్తూ కొత్తవారికి తగిన అవకాశాలు కల్పిస్తూ కెసిఆర్ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తూ వస్తున్నారు. అయితే, ఎన్నికల్లో ప్రజల మద్దతు ఆయనకు ఈ విషయంలో కలిసి వస్తూ వచ్చింది.
ఎన్నికల్లో విజయాలకు, ప్రజల మద్దతుకు కెసిఆర్ అనుసరించిన వ్యూహం ఏమిటనేది పక్కన పెడితే కాంగ్రెసు, టిడిపి కూడా తెలంగాణలో చావు దెబ్బ తిన్నాయి. తెలంగాణలో ఎప్పటికైన బలీయంగా ఉంటుందని భావించిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెసు కన్నా ఘోరంగా దెబ్బ తిన్న సూచనలు కనిపిస్తున్నాయి.
చంద్రబాబు అనుసరించిన వైఖరి వల్ల ఈ పరిస్తితి వచ్చిందని అంటున్నారు. జూనియర్లకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తూ సీనియర్లను పక్కన పెట్టడం తీవ్రమైన అసంతృప్తికి దారి తీసింది. రేవంత్ రెడ్డి ప్రాబల్యం పార్టీలో పెరుగుతున్న కొద్దీ ఆ ఆసంతృప్తి పార్టీని వీడే స్థితికి చేరుస్తోందని అంటున్నారు.
తెలంగాణలో చంద్రబాబు లేకపోవడం కూడా టిడిపిని దెబ్బ తీస్తోంది. కెసిఆర్ను నమ్ముకోవాల్సిందే తప్ప చంద్రబాబు ఇక్కడికి వచ్చి చేసేదేమీ ఉండదనే అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. దానికి తోడు, సీమాంధ్ర ఆధిపత్యం రాష్ట్ర విభజన తర్వాత కూడా కొనసాగించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే అబిప్రాయం తెలంగాణలో బలంగా ఉంది.
పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు మాత్రమే కాకుండా చంద్రబాబు కెసిఆర్ పట్ల వ్యవహరించిన తీరు, హైదరాబాద్ ఎన్నికల్లోకి ఆంధ్రప్రదేశ్ మంత్రులను, ఆంధ్ర నాయకులను ప్రవేశపెట్టడం కూడా దెబ్బ తీసింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీపై కూడా ఆంధ్ర నాయకుల పెత్తనమే సాగుతోందనే అభిప్రాయం కలగడానికి అది అవకాశం ఇచ్చింది.
నిజానికి, ఓటుకు నోటు కేసు ముందుకు వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం తెలంగాణలో తగ్గుతూ వచ్చింది. చంద్రబాబు పట్ల ఉన్న ఆదరణ కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం టిడిపిని పూర్తిగా దెబ్బ తీసింది. రేవంత్ రెడ్డి పట్టుబడిన తర్వాత కూడా ఆయనకే పార్టీలో ప్రాధాన్యం కల్పించడం వల్ల ప్రజల్లో పార్టీ ప్రతిష్ట దిగజారిందనే అభిప్రాయం నెలకొంది. దీంతో పార్టీలో సీనియర్లు పార్టీలో ఇమడలేని పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
అంతేకాకుండా, చంద్రబాబు కెసిఆర్ను అమరావతి శంకుస్థాపనకు అహ్వానించడం దగ్గర నుంచి కెసిఆర్పై ధీటుగా విమర్శలు పెట్టలేకపోవడం వరకు తెరాసకు కలిసి వచ్చింది. కెసిఆర్ను చంద్రబాబు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరనే అభిప్రాయం తెలంగాణ ప్రజల్లోనే కాకుండా తెలంగాణలోని, ముఖ్యంగా హైదరాబాదులోని ప్రజల్లో నాటుకుపోయింది. ఈ వ్యవహారాలన్నింటిలో కెసిఆర్ వ్యూహాలు, రాజకీయ చతురత పనిచేసింది.