ఢిల్లీలో కేసీఆర్, రామోజీరావుని మెచ్చుకున్నప్రధాని
హైదరాబాద్: ఈ నెల 16వ తేదీన హైదరాబాదులో పెద్ద ఎత్తున జరగనున్న స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్రమంత్రులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆహ్వానించనున్నారు. గురువారం కేసీఆర్ ప్రధానితో పాటు పలువురితో భేటీ కానున్నారు. వారిని స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం కోసం ఆహ్వానిస్తారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం కేసీఆర్ బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట మంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తదితరులు ఉన్నారు. సచివాలయ నిర్మాణం తదితర అవసరాల కోసం హైదరాబాదులోని కంటోన్మెంట్ ప్రాంతం, జింఖానా, బైసన్ మైదానాల తరలింపు, హైకోర్టు విభజన, విభజన చట్టంలోని హామీలపై కేసీఆర్ మాట్లాడనున్నారు.
రామోజీ గ్రూపుకు మోడీ లేఖ
స్వచ్ఛ భారత్ కార్యక్రమాల పైన రామోజీ గ్రూపు సంస్థల కృషి గర్వకారణమని ఆ సంస్థల అధినేత రామోజీ రావుకు ప్రధాని మోడీ లేఖ రాశారు. పరిశుభ్రత భారత స్వప్న సాకారం కోసం స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో మమేకమై సమాజంలో విస్తృతస్థాయిలో శుభ్రతా స్ఫూర్తిని రగిలించేందుకు కృషి చేస్తున్న రామోజీ రావును అభినందించారు.
స్వచ్ఛమైన, పరిశుభ్రమైన భారత దేశాన్ని సాధించడమన్నది ఏ ఒక్క వ్యక్తివల్లో లేక ప్రభుత్వ ఉద్యోగుల వల్లో అయ్యే పని కాదని, దీనికి 125 కోట్ల మంది ప్రజలు కలిసి రావడం అవసరమని, ఈ దిశగా రామోజీ రావు, ఆ సంస్థ సభ్యులందరూ సుస్థిర సంకల్పంతో సాగిస్తున్న కృషి తనకు ఎంతో గర్వకారణంగా ఉందని ప్రధాని మోడీ ప్రశంసించారు.