హైటెక్ బస్సుపై అసంతృప్తి: పక్కన పెట్టిన కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రగతి రథం పేరుతో ఐదు కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా తయారు చేయించిన అత్యధునాతన బస్సుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన బస్సును పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. బస్సులో సరైన సదుపాయాలు లేవని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం.
సీటింగ్ సదుపాయం సరిగా లేదని, ఎలక్ట్రానికి సౌండ్ సిస్టమ్స్ కూడా పనిచేయడం లేదని కెసిఆర్ అన్నట్లు తెలుస్తోంది. దాంతో ఆయన ఆ బస్సును పక్కన పెట్టి రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లోని హరితహారం కార్యక్రమాలకు రెగ్యులర్ కాన్వాయ్లోనే వెళ్లారు.
కాగా, కొత్త బస్సును అధికారులు రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని బెంజ్ కంపెనీ గ్యారేజీకి చేర్చారు. బస్సులో ఉన్న లోపాలను, సీటింగ్ సిస్టమ్ను మార్చనున్నట్లు తెలుస్తోంది. మెర్సిడీజ్ బెంజ్ కంపెనీకి చెందిన ఆ బస్సు చండిగఢ్లో తయారైంది.
కొత్త బస్సుకు శుక్రవారం యాదగిరిగుట్టలో పూజలు చేయించారు. ఆ తర్వాత దాన్ని చిలుకూరుకు తరలించారు. చిలుకూరులో కెసిఆర్ శుక్రవారం హరితవనం కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. బస్సులోనే పడకగది, బాత్రూం, చిన్నపాటి సమావేశ మందిరం ఉంటాయి. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉండాల్సిన హంగులన్నీ ఈ బస్సులో ఉంటాయి.