చరిత్రాత్మక తీర్పు, కనీవినీ ఎరుగని ట్రీట్: విజృంభించి పని చేస్తామన్న కెసిఆర్
హైదరాబాద్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు అన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని ట్రీట్ ఇచ్చారని అన్నారు.
మిగితా అన్ని పార్టీల డిపాజిట్లు గల్లంతు చేశారని చెప్పారు. భారీ మెజార్టీతో టిఆర్ఎస్ లోకసభ అభ్యర్థి పసునూరి దయాకర్ని గెలిపించిన వరంగల్ ప్రజలకు ప్రభుత్వం పక్షాన, పార్టీ పక్షాన, వ్యక్తిగతంగా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు.
మంగళవారం సాయంత్రం కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. వరంగల్ ప్రజల తీర్పు ప్రభుత్వంపై వారి మనోభావాలకు అద్దం పట్టిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలపై వారు సానుకూలంగా స్పందించారని అన్నారు. ఇవి బతిమాలితే, డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చే ఓట్లు కావని అన్నారు.
ప్రజలు ప్రభుత్వం పట్ల అనుకూలంగా ఉండబట్టే ఇంత భారీ విజయాన్నందించారని అన్నారు. ప్రతిపక్షాలు, కొన్ని మీడియా, పత్రికలు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. గుడ్డి ఆరోపణలు మాని నిర్మాణాత్మక ప్రతిపక్షాలుగా వ్యవహరించాలని సూచించారు.
టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న కూడా తామే గెలుస్తామని భీరాలు పోయారని అన్నారు. గతంలో 2లక్షల ఓట్లు వస్తే ఇప్పుడు డిపాజిట్ కూడా ఆ పార్టీకి దక్కలేదని కెసిఆర్ అన్నారు. 7శాతం ఓట్లు కూడా తగ్గాయని చెప్పారు. అసమ్మతి ఉందని ఆంధ్రజ్యోతి పత్రిక, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని ప్రయత్నించి దెబ్బతిన్నాయని అన్నారు.
బీహార్, మధ్యప్రదేశ్లోని రత్లాంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో బిజెపి ఓడిపోయిందని గుర్తు చేశారు. వరంగల్ ప్రజల తీర్పు శిరోధార్యంగా భావించి విజృంభించి పని చేస్తామని కెసిఆర్ అన్నారు. ఈ తీర్పుతో తమకు గర్వం రాదని చెప్పారు.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. నారాయణ్ ఖేడ్ ఎన్నికల్లో కూడా తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.