అబ్దుల్ కలాం ఇక లేరు: హైదరాబాదులో అనేక పరిశోధనలు చేశారన్న కెసిఆర్
హైదరాబాద్: భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతాపం ప్రకటించారు. హైదరాబాదులో కలాం అనేక పరిశోధనలు చేశారని ఆయన అన్నారు. ఆయన మరణవార్త వినగానే ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అబ్దుల్ కలామ్ మృతి దేశానికి తీరని లోటు అని ఆయన అన్నారు. క్షిపణి తయారీ రంగంలో నైపుణ్యం కలిగిన కలాం గొప్ప మానవతావాది అని ఆయన ప్రశంసించారు. మిసైల్ మ్యాన్గా పేరు సాధించిన కలామ్ హైదరాబాదులో అనేక పరిశోధనలు చేశారని ఆయన గుర్తు చేశారు. కలాం చేసిన సేవలు భారతదేశ విజ్ఢానాన్ని ద్విగుణీకృతం చేస్తాయని ఆయన అన్నారు.
అబ్దుల్ కలామ్ మృతికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సంతాపం ప్రకటించారు. ఆయన మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్య్కంత చేశారు.
కలాం మృతి దేశానికి తీరని లోటు అని చంద్రబాబు నాయుడు అన్నారు. దేశం గొప్ప శాస్త్రవేత్తను, దార్శనికుడిని, స్ఫూర్తిదాతను కోల్పోయిందని ఆయన అన్నారు.