ఆ ముగ్గురు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు: కెసిఆర్
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన ముగ్గురు పోలీసులు ప్రజల హృదయాల్లో నిలిపోతారని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. నల్గొండ జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు నాగరాజు, లింగయ్య, హోంగార్డ్ మహేష్ మృతి చెందిన విషయం తెలిసిందే.
రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ, ఇతర పోలీసు ఉన్నతాధికారు శనివారం సిఎం కెసిఆర్తో సమావేశమై ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. సూర్యపేట ఘటనలో మృతి చెందిన పోలీసులది గొప్ప త్యాగమని చెప్పారు.
మృతుల కుటుంబాలను ఆర్థికంగానూ, అన్ని విధాలా ఆదుకుంటామని అన్నామన్నారు. కాల్పుల్లో గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. సంఘ విద్రోహక శక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు.
రెండురోజుల్లో మట్టుబెట్టడం అభినందనీయం: జానా
ముగ్గురు పోలీసులను బలితీసుకున్న ఇద్దరు దుండగుల రెండు రోజుల్లోనే మట్టుబెట్టడం అభినందనీయమని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. ప్రతి అంశమూ ప్రభుత్వ వైఫల్యమని చెప్పడం తగదని, పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీలకు షాక్ ఇచ్చారు.
అంతేగాక, దుండగుల కాల్పుల ఘటనను ప్రభుత్వం తరపున ఖండిస్తున్నామని చెప్పారు. పక్కనే ఉన్న షబ్బీర్ అలీ గుర్తుచేయడంతో ప్రతిపక్షం తరపున ఖండిస్తున్నామని అన్నారు.