తొండి చేస్తున్నదే చంద్రబాబు, మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్లు..: కెసిఆర్
హైదరాబాద్: తొండి చేస్తున్నదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. మంత్రివర్గ సమావేశానంతరం ఆయన బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.తమ ప్రభుత్వాన్ని తెలంగాణ ఇబ్బంది పెడుతున్నదంటూ ఇటీవల చంద్రబాబు అనడాన్ని ఓ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా.. "తెలంగాణ ప్రభుత్వం ఏపీని ఏం ఇబ్బందులు పెడుతున్నదో మీకు తెలియదా! మా రాష్ర్టానికి వచ్చిన ఏడు మండలాలు గుంజుకుంది చంద్రబాబునాయుడు. తెలంగాణకు కేటాయించిన కరెంటు ఇవ్వకుండా తొండి చేసింది చంద్రబాబునాయుడు.. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుంది" అని అన్నారు.
పెట్టే ఇబ్బందులు వాళ్లు పెట్టి, అనవసరమైన అపోహలు పెట్టుకుని తెలంగాణ మీద ఆరోపణలు చేస్తే వాటిని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తామని తప్ప తాము చెప్పేది ఏం లేదని, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు ఉన్నారని, అక్కడా రైతులు ఉన్నారని, వాళ్లు కూడా మంచిగ బతకాలని కోరుకుంటామని, అదే సమయంలో తాము మంచిగ బతకాలని కోరుకుంటామని, అంతకుమించి ఏమీ ఉండదని, వాళ్ల (ఏపీ ప్రభుత్వం) ఆరోపణలు పట్టించుకోవాల్సిన పనిలేదని అన్నారు.తన కంఠంలో ప్రాణమున్నంత వరకూ తెలంగాణకు నష్టం కలిగే పని జరుగనివ్వనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.
"తెలంగాణ తేవడంలో ప్రధాన భూమిక పోషించింది కేసీఆర్. ఐయామ్ ఏ ఫైటర్.. ఐ యామ్ ఏ క్రూసేడర్.. ఈ రోజు డెఫినెట్గా తెలంగాణ మంచి కోసం పునాదులు వేస్తం తప్ప.. తెలంగాణకు నష్టం జరిగే పని నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు జరగనివ్వను. ఆ ప్రశ్నే తలెత్తదు. కాబట్టి ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు" అని చెప్పారు.
ప్రాజెక్టుల నిర్మాణంపై కాంగ్రెస్పార్టీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వాళ్ల మెప్పుకోసం ప్రభుత్వం పిచ్చి పనులు చేయదని తేల్చిచెప్పారు. పనికిమాలిన విమర్శలు మానుకోవాలని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని అడిగామని ఆయన చెప్పారు.
నీటి పారుదల రంగంలో భయంకరమైన దోపిడీ జరిగిందని, మొత్తం గోదావరి నదిమీద పెద్ద ప్రాజెక్టులు, మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టులు కాకుండా 218 బరాజ్లు మహారాష్ట్రలో నిర్మించారని అన్నారు. ప్రభ, మంజీర బరాజ్లు నిర్మించారని ఆయన అన్నారు. ఈ ఏడాది గోదావరినుంచి చుక్కనీరు కూడా కిందికి రాలేదు. కృష్ణ, భీమ, తుంగభద్ర మీద 78 బరాజ్లు నిర్మించారని అన్నారు.
ఆ గోదావరి నీళ్లు వాడుకోవడంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా, అలసత్వం జరిగినా మొత్తం దెబ్బతిని పోతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంద్రావతి-ప్రాణహిత నీళ్లు వచ్చేచోట మనకు కావాల్సినన్ని నీళ్లు ఉన్నాయని, ఆ నీళ్లనే వాడుకోవాల్సిన అవసరం ఉందని, మహారాష్ట్రతో, ఛత్తీస్గఢ్తో ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా, వివాదాలు లేకుండా మనకు అనుకూలమైన రీతిలో మనం ఎక్కువ నీళ్లు తీసుకునే దానిపై ఈ రోజు సర్వేలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
ఇక్కడా తొలగించాల్సినవి చాలా ఉన్నాయి
తెలంగాణ పాఠ్యాంశాల్లోనూ ఏపీకి చెందిన అనేక విషయాలు తొలగించాల్సి ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఏపీ పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ, హైదరాబాద్ చరిత్రను తొలగించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ.. "ఇది మాకు మంచి సంతోషాన్నిచ్చే వార్త. ఎందుకంటే ఇక్కడ కూడా తీసేయాల్సినవి చాలా ఉన్నయి. ఇప్పుడు వాళ్లే మాకు తోవ చూపిచ్చిన్రు.. కాబట్టి మా పని ఇంక సులువైంది. మేం కూడా ఏం పెట్టాలి, ఏం తీసెయ్యాలి అనేది తొందరల్లోనే ఆలోచిస్తాం" అని అన్నారు.