కెసిఆర్ అన్న కూతురు అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు సోదరుడి(అన్న) కూతురు అరెస్ట్ అయ్యారు. నగరంలోని గన్పార్క్ ఎదుట కేసీఆర్ అన్న కుమార్తె రమ్య మంగళవారం ఆందోళన చేపట్టారు.
చొప్పదండి టిఆర్ఎస్ ఎమ్మెల్యే బొడిగ శోభను అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రమ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలం క్రితం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
అంతకుముందు కెసిఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడున్నారంటూ ఆరోపణలు కూడా గుప్పించారు రమ్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆమె టిఆర్ఎస్ పార్టీపై పలుమార్లు విమర్శలు గుప్పించారు.
తనపై దాడులు చేయిస్తున్న టిఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలంటూ 2014, మార్చిలో రమ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అంతకుముందు కెసిఆర్పై మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం.
దాడి చేసినా అరెస్ట్ చేయరా?: రమ్య
చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభను తక్షణం అరెస్టు చేయకపోతే అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగుతానని టీపీసీసీ అధికార ప్రతినిధి రేగులపాటి రమ్య హెచ్చరించారు. గాంధీభవన్లో సోమవారం ఆమె మాట్లాడారు.
కరీంనగర్లోని తమ ఫంక్షన్ హాల్పై దాడి చేసిన కేసులో శోభకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయినా ఆమెను అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రమ్య ఆరోపించారు. 2013లో శోభ, మరికొంత మంది కలిసి తమ ఫంక్షన్ హాల్పై దాడి చేసి రూ.45 లక్షల వరకు నష్టం చేశారని ఫిర్యాదు చేశామనీ, దీనిపై విచారణకు రమ్మని కోర్టు ఆదేశించినా గైర్హాజరయ్యారని ఆమె తెలిపారు.