వరంగల్ ఉప ఎన్నిక: ఫలించిన కెసిఆర్ 'భారీ' వ్యూహం, బిజెపి కొంపముంచారు!
వరంగల్: వరంగల్ ఉప ఎన్నికల్లో గెలుపు వెనుక టిఆర్ఎస్ భారీ వ్యూహమే రచించింది. క్షేత్రస్థాయిలో ప్రతి అరవై మందికి ఓ నేతను నియమించి ప్రభుత్వ పథకాలు, ఉద్యమంలో పోరాడిన తీరు పైనవివరించి చెప్పడం ద్వారా అత్యధిక ఓట్లు తమ అభ్యర్థి దయాకర్కు వచ్చేలా చేసుకున్నది.
వరంగల్ లోకసభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ఐదవేల మందికి పైగా నేతలు నిత్యం ప్రజల వద్దకు వెళ్లారు. గులాబీ వ్యూహం ఎక్కడా బయటకు పొక్కకుండా వారు తమ పని తాము కానిచ్చుకుంటూ పోయారు. వీరంతా ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించే విధంగా పని చేసుకుంటూ పోయారు.
కుల సంఘాలతో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి ఓట్లను రాబట్టే ప్రయత్నం టిఆర్ఎస్ చేసింది. అలాగే, బిజెపి అభ్యర్థి దేవయ్య, కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణలు స్థానికులు కాదనే అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకు వెళ్లింది. టిఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నాడని తీసుకు వెళ్లింది.
బిజెపికి నిరాశ
వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలాగే బిజెపికి ఘోర పరాభవం ఎదురైంది. అయితే, తమకు బలం లేకుండానే ఎక్కువ బలం ఊహించుకుందనే వాదనలు కూడా ఉన్నాయి. దానికి తోడు ఆఖరుదాకా అభ్యర్థి అంశాన్ని తేల్చకపోవడం, ఆయన జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ... అక్కడి వాడు కాకపోవడాన్ని టిఆర్ఎస్ ప్రచారం చేసింది. ఓడిపోగానే కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు వెళ్లిపోతారని టిఆర్ఎస్ గట్టిగా ప్రచారం చేసింది.
టిడిపి అండతో ఓరుగల్లో పోరులో తాము రెండో స్థానంలో అయినా నిలబడుతామని బిజెపి ఆశించింది. కానీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే మూడు శాతం ఓట్లు తక్కువ రావడం గమనార్హం. ప్రధాని మోడీ పాలన తదితరాలు తమకు లాభం చేకూర్చుతాయని భావించింది.
కానీ, ఈ ఎన్నిక ద్వారా ప్రజల్లో ఇంకా తెలంగాణవాదం పోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు దేవయ్య హడావిడిగా పార్టీలోకి రావడం, అభ్యర్థిని ఖరారు చేయడం పెద్ద చర్చకు దారి తీసింది. ఎన్నికలకు ముందు జిల్లాకు చెందిన బిజెపి, టిడిపి నేతలు టిఆర్ఎస్లోకి వలస పోవడం కూడా దెబ్బతీసింది.