‘మనమే నెం.1, అమెరికాకే అప్పు’: విద్యార్థులకు కేసీఆర్ శుభవార్త
సంక్షేమ రంగంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయబోమని కేసీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: సంక్షేమ రంగంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం సభ్యులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రాన్ని, సుప్రీంకోర్టును కోరుతామని చెప్పారు. బీసీల రిజర్వేషన్ పెరగాల్సి ఉందన్నారు. బీసీల రిజర్వేషన్లపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు.
మతపరమైన రిజర్వేషన్లను ప్రతిపాదించడం లేదన్నారు. ఇప్పటికే అమలవుతున్న రిజర్వేషన్లను పెంచుతామని ప్రకటించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం గిరిజనులు, మైనార్టీల రిజర్వేషన్లు పెంచుతామన్నారు. రిజర్వేషన్లు పెంచే సిద్ధమవుతోందన్నారు. వారం రోజుల్లో రిజర్వేషన్లపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరుపుతామన్నారు.
తాము 3.7 లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు రూ. 1000 చొప్పున పింఛన్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. 'పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా వారి వివాహాలకు రూ. 75 వేల చొప్పున ఇస్తున్నాం' అని తెలిపారు. రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేశాం. ఇది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాగుందని నిర్ధారణకు వచ్చాకే డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రకటన చేశామన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేస్తామన్నారు.
విద్యార్థులకు శుభవార్త-మెస్ ఛార్జీల పెంపు
పేద విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచుతున్నట్లు శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. 3వ తరగతి నుంచి 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ. 750 నుంచి రూ. 950కి పెంపు, 8 నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ. 850 నుంచి రూ. 1100కు పెంపు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులవిద్యార్థులకు రూ.1050 నుంచి రూ. 1400కు పెంచారు. మెస్ ఛార్జీల పెంపుతో 18 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. మెస్ ఛార్జీలు పెంచడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సీఎం కేసీఆర్.
కేజీ టు పీజీ నా డ్రీమ్ ప్రాజెక్ట్
రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేజీ టు పీజీ నా డ్రీమ్ ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సమాధానం సందర్భంగా సీఎం మాట్లాడారు. ఇండియాలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టంలో విద్యా విధానం అమలు కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. కేజీ టు పీజీ ప్రాజెక్టులో పటిష్టమైన అడుగు ముందుకు వేశామన్నారు. ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్థి స్థాయిలో తీసుకురావడానికి కొంత సమయం పడుతుందన్నారు. గతంలో ఎన్నుడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీ విద్యార్థినుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశాం. త్వరలోనే గురుకులాల్లో 24 వేల మందిని రిక్రూట్ చేసుకోబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు.
విద్యుత్ సమస్యను అధిగమించాం
విద్యుత్ అధికారులు రోజంతా పని చేయడం వల్ల కోతలు లేకుండా కరెంట్ను ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. గతంలో విద్యుత్ కోసం పరిశ్రమ వర్గాలు, రైతులు ఎంతో ఆందోళన చేసేవారు. హైదరాబాద్ లోనే దాదాపు 2 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉందన్నారు. రెండున్నరేళ్లలో విద్యుత్ మెరుగు పడటానికి చేసిన ఖర్చు రూ. 12,136 కోట్లు అని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో చేసిన అంధకారాన్ని తొలగించి విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు. సాధించుకున్న రాష్ర్టంలో ప్రాధామ్యాలను గుర్తించి ముందుకెళ్లాలని సూచించారు. విద్యుత్ అవసరం ప్రాధాన్యతను గుర్తించి సమస్యను అధిగమించామని సీఎం పేర్కొన్నారు.
అప్పులు తీర్చేస్తాం.
తమ ప్రభుత్వం అప్పులు చేస్తోందంటూ ప్రతిపక్ష సభ్యులు విమర్శలు చేస్తున్నారని, ఆ విమర్శలు సరికావని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎకనామిక్స్లో ట్రెండ్స్ మారిపోయాయని, ప్రపంచం ఎటు వెళుతుందో మనమూ అటు వైపే వెళ్లాలని అన్నారు. ప్రపంచంలో అత్యధిక ధనిక దేశం అమెరికా అని, అత్యధిక అప్పులు కూడా ఆ దేశానికే ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వారు మనకన్నా తెలివిఎక్కువ వారే కానీ, తెలివి తక్కువ వారు కాదు అని అన్నారు. అప్పులు తెచ్చుకునే వీలు ఉంటే తెచ్చుకోవచ్చని అన్నారు. అప్పులు తెచ్చి వాటిని ఖర్చు పెట్టకపోతేనే తప్పవుతుందని చెప్పారు. అప్పులు తీసుకోవడమే కాదు.. మళ్లీ తిరిగి తీరుస్తూనే ఉంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తిరిగి చెల్లిస్తూనే ఉందని చెప్పారు.
హోంగార్డులను రెగ్యూలర్ చేస్తాం..
తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డులను త్వరలో రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ అన్నారు. తాము మెస్ చార్జీలను పెంచుతున్నామని, దానితో 18లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే విద్యుత్ కొరతను అధిగమించేందుకు తీవ్రంగా శ్రమించి, ఆ కొరతను తీర్చామని చెప్పారు. తెలంగాణలో డిమాండ్కు తగ్గట్లు విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నామని అన్నారు. అలాగే రాష్ట్ర ఆర్థిక ప్రగతి బాగుండడంతోనే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు.
సభ వాయిదా..
తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. సోమవారం ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘ చర్చ అనంతరం సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.