తన ఆరోగ్యంపై కేసీఆర్ స్పందన, మోడీకి ప్రశంస, గొంతు పట్టుకుంటా బిడ్డా అని షాపై
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఆరోగ్యంపై విలేకరుల సమావేశంలో స్పందించారు. ఇటీవల పలుమార్లు వైద్య చికిత్స తీసుకున్న నేపథ్యంలో మీ ఆరోగ్యం ఎలా ఉందని ఓ విలేకరి ప్రశ్నించారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ఆరోగ్యంపై విలేకరుల సమావేశంలో స్పందించారు. ఇటీవల పలుమార్లు వైద్య చికిత్స తీసుకున్న నేపథ్యంలో మీ ఆరోగ్యం ఎలా ఉందని ఓ విలేకరి ప్రశ్నించారు.
దానికి కేసీఆర్ సమాధానం ఇచ్చారు. 'మీతో గంట నుంచి మాట్లాడుతున్నా కనపడడం లేదా? ఆరోగ్యంగానే ఉన్నా' అన్నారు. తన ఆరోగ్యంపై చాలాకాలంగా ప్రచారం జరగడంపై స్పందిస్తూ.. మూడేళ్లుగా కేసీఆర్ చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు అన్నారు.
తన ప్రెస్ మీట్లో ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించి అమిత్ షా పై నిప్పులు చెరిగారు. కేంద్రంతో వైరం లేదని, అయితే అమిత్ షా ఇక్కడకు వచ్చి నీ చొక్కా గుంజుతా.. లాగు గుంజుతా అంటే ఊరుకుంటామా అని కేసీఆర్ అన్నారు నీ గొంతు పట్టుకుంటా బిడ్డా అంటున్నానని వ్యాఖ్యానించారు.
త్వరలో వరుస ఇంటర్వ్యూలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడుస్తున్న సందర్భంగా తాను త్వరలోనే మూడు నాలుగు రోజులు టీవీ ఛానెళ్లలో కూర్చొని వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తానని, తెలంగాణలో జరుగుతున్న పనుల గురించి వివరిస్తానని చెప్పారు.
మోడీకి కితాబు
ప్రధాని నరేంద్ర మోడీ అంటే తమకు గౌరవం ఉందని కేసీఆర్ చెప్పారు. కేంద్రంతో తమకు ఎలాంటి వైరం లేదని తేల్చి చెప్పారు. నోట్ల రద్దు సమయంలో బీజేపీ సీఎంలు కూడా మౌనంగా ఉన్న సమయంలో తాను మద్దతు పలికానని చెప్పారు.
దేశ రాజకీయాలతో సంబంధం లేదు
తమకు దేశ రాజకీయాలతో సంబంధం లేదని, అందుకే మద్దతు పలికానని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ముఖ్యమని చెప్పారు. మూడేళ్ల మోడీ ప్రభుత్వంలో, తమ ప్రభుత్వంలో స్కాంలు లేవని, విచ్చలవిడితనం లేదన్నారు. ఉంటే ఎవరో మగోడు ప్రూవ్ చేయాలన్నారు.
అమిత్ షాపై నిప్పులు
కాగా, అంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాపై కేసీఆర్ నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారని, తమను కెలికారని మండిపడ్డారు. అబద్దాలు చెప్పినందుకు, తెలంగాణను అవమానించినందుకు రాష్ట్రం విడిచిపోక ముందే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీకి ఒక్క సీటు రాదు
తెలంగాణలో గత ఎన్నికల్లో బీజేపీకి 5 సీట్లు వచ్చాయని, కానీ ఈసారి ఒక్క సీటు కూడా రాదని తన సర్వేలో తేలిందని కేసీఆర్ అన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏమిటో తెలిసిపోయిందన్నారు. తెలంగాణను నిందించే ఎవరైనా తమ శత్రువులే అన్నారు. తెరాసను, కేసీఆర్ను అంటే కాదని తెలంగాణను అంటే మాత్రం ప్రాణం పోయినా పోరాడుతామన్నారు.