తొలి నుంచీ కెసిఆర్ టార్గెట్ చంద్రబాబే: టిడిపిలో మిగిలిందెవరు, వెళ్లిందెవరు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుంచి, తెలంగాణ ఉద్యమ కాలం నుంచే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకున్నారు. తెలంగాణలో టిడిపిని తుడిచిపెట్టడమే పనిగా ఆయన పనిచేస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, తన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆ పనిని ముమ్మరం చేశారు.
తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినవారిలో తెలంగాణలో 15 మంది శాసనసభ్యులు గెలిచారు. వారిలో ఒక్కరొక్కరే తెరాసలో చేరుతున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది మంది శాసనసభ్యులు తెరాసలో చేరారు. ఏకంగా తెలుగుదేశం శాసనసభా పక్షం (టిడిఎల్పీ) నేత ఎర్రబెల్లి దయాకర్ రావే గులాబీ కండువా కప్పుకున్నారు.
తాను పోతూ పోతూ రాజేంద్ర నగర్ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ను కూడా కారెక్కించారు. ఇంకా ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులు తెరాసలోకి వస్తారని తెరాసలో చేరిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. హైదరాబాదు నుంచి కెసిఆర్ తలసాని శ్రీనివాస యాదవ్ను తీసుకుని ఏకంగా ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు. అప్పటి నుంచి ఆ వలసలు సాగుతూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి నమ్మకంగా, విశ్వసనీయంగా ఉంటూ వచ్చినవారు కూడా తెరాసలోకి దుమికారు.
నిజానికి, తెరాసకు మరో శాసనసభ్యుడు టిడిపి నుంచి వస్తే సరిపోతుంది. అది పార్టీ ఫిరాయించిన టిడిపి శాసనసభ్యులపై వేటు పడకుండా కాపాడుతుంది. శాసనసభలో టిడిపిని చీల్చి తెరాసలో చీల్చడానికి పది సంఖ్య సరిపోతుంది. పార్టీని చీల్చి, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అధిగమించడానికి మూడింట రెండు వంతుల శాసనసభ్యులు చీలితే చాలు. టిడిపి నుంచి చీలిన వర్గం ఏకంగా పార్టీని తెరాసలో విలీనం చేయడానికి వీలవుతుంది. దానికోసమే కెసిఆర్ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నారు.
వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలనేది కెసిఆర్ వ్యూహంగా చెబుతున్నారు. అందుకే మార్చి 16వ తేదీదాకా ఆగుతానని చెప్పిన ఎర్రబెల్లి దయాకర్ రావును తొందర పెట్టి పార్టీలో చేర్చుకున్నారని అంటున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తెరాసలో చేరిన తర్వాత మిగతా ఒక్కరో ఇద్దరో పార్టీలోకి రావడం పెద్ద కష్టం కాకపోవచ్చునని అంటున్నారు.
పార్టీలో మిగిలిన ఎల్బీ నగర్ శాసనసభ్యుడు ఆర్. కృష్ణయ్య టిడిపికి దూరంగానే ఉంటున్నారు. తాజాగా చెలరేగిన కాపు వివాదం నేపథ్యంలో ఆయన తనకు పార్టీతో సంబంధం లేదని కూడా చెప్పారు. అరికెపూడి గాంధీ తెరాసలో చేరుతారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే, ఆయన ప్రచారాన్ని ఖండించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు సమస్యలతో సతమవుతున్న చంద్రబాబుకు తెలంగాణలో పార్టీపై దృష్టి పెట్టే వెసులుబాటు కూడా లేకుండా పోయింది. బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎత్తులను జిత్తులను ఎదుర్కోవడానికి ఆయన సమయం వెచ్చించాల్సి వస్తోంది. అదే సమయంలో ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని బయటపడేయడానికి ఆయన చెమటోడ్చాల్సి వస్తుంది. రాజధాని లేకపోవడం, అధికార యంత్రాంగం ఇంకా హైదరాబాదులోనే ఉండడం కూడా ఆయనకు ఇబ్బిందిగానే ఉంది.
హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం ఒక విధంగా కెసిఆర్కు పెద్ద కష్టమేమీ లేకుండా పోయింది. చంద్రబాబు హైదరాబాద్ విషయంలో సృష్టించిన వివాదాన్ని కూడా ఆయన పరిష్కరించుకున్నారు. ఇక, ఆయన తెలంగాణలో ప్రతిపక్షాలను చిత్తుచేసే పని పెట్టుకున్నారు. అందులో భాగంగానే టిడిపిని తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తూ తన పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు.
తెరాసలోకి జంప్ చేసిన టిడిపి శాసనసభ్యులు
వివేక్, సాయన్న, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మాధవరం కృష్ణారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు.
టిడిపిలో మిగిలిన శాసనసభ్యులు
మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీ, రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, రాజన్నరెడ్డి, ఆర్. కృష్ణయ్య