పిచ్చోడి కథ: రేవంత్ రెడ్డిపై కెసిఆర్, బాబే అడ్డు అని అడిషనల్ ఎజి
హైదరాబాద్: అదో పిచ్చివాడి కథ వదిలేయండని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి గురించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. గురువారం రంజాన్ వేడుకల గురించి వివరించడానికి నిర్వహించిన మీడియా సమావేశం చివరలో ‘మీపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మీ స్పందన ఏమిటి' అని మీడియా ప్రతినిధులు అడిగితే ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు.
తెలంగాణకు హైకోర్టు రాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని తెలంగాణ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఆరోపించారు. ప్రత్యేక హైకోర్టు వస్తే తప్పించి తమకు కనీస న్యాయం జరిగే అవకాశాలు లేవని ఆయన అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో తనకున్న పలుకుబడితో చంద్రబాబు తెలంగాణకు హైకోర్టు రాకుండా అడ్టుకుంటున్నారని ఆయన గురువారం మీడియా సమావేసంలో ఆరోపించారు.
హైకోర్టులో ఉన్న న్యాయమూర్తులలో అధిక శాతం చంద్రబాబుకు సన్నిహితులు కావటంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.హైకోర్టులో మాదిరి సుప్రీంకోర్టులో కూడా అధిక శాతం న్యాయమూర్తులు చంద్రబాబుకు సన్నిహితులు కావటంతో సమీప భవిష్యత్లో తెలంగాణకు హైకోర్టు వస్తుందన్న నమ్మకం లేదని చెప్పారు. న్యాయ వ్యవస్ధను ప్రభావితం చేసి కలుషితం చేయటంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
హైకోర్టులో ఆంధ్రప్రాంతానికి చెందిన నలుగురైదుగురు న్యాయమూర్తులు వివాదాలకు, అవినీతికి దూరంగా ఉంటూ అత్యంత సమర్ధవంతంగా తమ విధులను నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. స్వయం ప్రతిపత్తితో సర్వ స్వతంత్రంగా వ్యవహరిస్తూ న్యాయం అందించవలసిన న్యాయ వ్యవస్థ కొంతమంది చేతిలో బందీ అయిపోవటంతో సామాన్యులకు న్యాయం లభించటం లేదని ఆయన విమర్శించారు.
తెలుగుదేశం శాసన సభ్యుడు రేవంత్రెడ్టి ఓటుకోసం నోట్లు ఇస్తూ పట్టుబడిపోయిన కేసులో అతనికి బెయిల్ మంజూరు చేయవద్దని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ చేసిన విజ్ఞప్తిని హైకోర్టుతిరస్కరించి బెయిల్ ఇవ్వటాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ విధమైన తీర్పుల వల్ల న్యాయ వ్యవస్ధపై ప్రజలకు నమ్మకం సడలిపోయే ప్రమాదం ఉందన్నారు.
న్యాయ వ్యవస్ధను చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. న్యాయవాదిగా తాను అనేక కేసుల విచారణలో పాలుపంచుకున్న అనుభవంతో వ్యవస్థ రోజు రోజుకూ దిగజారిపోతోందన్న స్ధిరాభిప్రాయానికి వచ్చినట్లు రామచంద్రరావు చెప్పారు.