‘అన్నా నేనున్నా.. ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి’: మాజీ ఎమ్మెల్యేకి సీఎం కేసీఆర్ భరోసా
అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో దీనస్థితిలో ఉన్న దొమ్మాట మాజీ ఎమ్మెల్యేకు నేనున్నానంటూ భరోసానిచ్చారు సీఎం కేసీఆర్. ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయమని ఆయనకు చెప్పారు.
సిద్దిపేట: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో దీనస్థితిలో ఉన్న మాజీ ఎమ్మెల్యేకు నేనున్నానంటూ భరోసానిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేయమని దొమ్మాట మాజీ ఎమ్మెల్యే డి. రాంచంద్రారెడ్డికి సీఎం కేసీఆర్ చెప్పారు.
పత్రికల్లో వచ్చిన కథనాల ద్వారా మాజీ ఎమ్మెల్యే పరిస్థితి గురించి తెలుసుకున్న సీఎం అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలోని కొండపాకలో మంగళవారం గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సీఎం వెళ్లారు.
1985లో టీడీపీ నుంచి గెలిచి...
1985లో దొమ్మాట నియోజకవర్గం నుంచి రాంచంద్రారెడ్డి తెలుగు దేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అధ్యక్షుడు ఎన్టీఆర్ తో విబేధాలు రావడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి మధ్యలోనే రాజీనామా చేశారు. ఆ తరువాత రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకున్నారు.
అడక్క మునుపే ఇంటి స్థలం...
మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి తన కుమార్తెలు సీత, గీతలతో కలిసి సీఎం కార్యక్రమానికి వెళ్లారు. వారు అడక్కముందే ఆయనకు సిద్దిపేటలో ఇంటి స్థలం కేటాయించాలని ఆ జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తనతోపాటే భోజనానికి...
గొర్రెల పంపిణీ కార్యక్రమం అనంతరం వారు సీఎంను కలవగా.. ‘అన్నా పద భోంచేసుకుంటూ మాట్లాడుకుందాం..' అంటూ సీఎం ఆయన్ని తన వెంట తీసుకెళ్లారు. వేద పాఠశాలలో ఏర్పాటు చేసిన భోజనశాలలో తనతోపాటే భోజనం చేయటానికి కూర్చోబెట్టుకున్నారు.
ఈ తమ్ముడు ఉన్నాడని మరువకు...
‘అన్నా భోంచేయండి..' అంటూ అప్యాయంగా అడిగారు కేసీఆర్. అయితే తాను షుగర్ పేషంటునని, మందులు వేసుకున్నాకే భోంచేస్తానని రాంచంద్రారెడ్డి బదులివ్వడంతో... ‘సరే అన్నా.. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమ్ముడున్నాడని మరువకు, వెంటనే ఫోన్ చెయ్..' అని చెప్పారు.
సీఎం భరోసాతో ఆనందం...
అంతేకాదు, ‘వదిన ఎలా ఉన్నారు? ఆమెకు నమస్తే చెప్పు..' అంటూ సీఎం కేసీఆర్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ తన గురించి స్పందించిన తీరుకు రాంచంద్రారెడ్డి చాలా సంతోషం వ్యక్తం చేశారు. సీఎం ఇచ్చిన భరోసా తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
కుమారుడి మరణంతో కుంగిపోయి...
ఆస్తులు కరిగిపోయి ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కుమారుడు చనిపోవడంతో ఆయన మరింత కుంగిపోయారు. చివరకు చికిత్స చేయించుకోవడానికి కూడా స్థోమత లేకుండా అయిపోయింది. ఫించను డబ్బులతోనే కాలం వెల్లదీస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు రాంచంద్రారెడ్డి ఇండియన్ నేవీలో ఆఫీసర్గా పనిచేశారు.