ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న కేసీఆర్, 'జగన్'తో బాబుపై దెబ్బకు దెబ్బ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సరైన కౌంటర్ ఇచ్చేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిరీక్షిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. చంద్రబాబు త్వరలో తన కేబినెట్ను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ కేబినెట్ విస్తరణలో ఇద్దరు ముగ్గురిని తొలగించి, ఐదాగురురికి కొత్తగా అవకాశం ఇవ్వవచ్చు. అందులో ఇద్దరు లేదా ముగ్గురు వైసిపి నుంచి గెలిచి ఆ తర్వాత టిడిపిలో చేరిన ప్రజాప్రతినిధులకు చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ ఛాన్స్ కోసం కేసీఆర్ ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు.
అందుకు కారణాలు లేకపోలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 15 మంది టిడిపి నుంచి గెలిచారు. వారిలో ముగ్గురు మినహా 12 మంది తెరాసలో చేరారు. అందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారికి మంత్రి పదవి కూడా దక్కింది.
ముగ్గురు మంత్రులకు షాకివ్వనున్న బాబు: లోకేష్పై సస్పెన్స్, వైసిపి నుంచి ఇద్దరికి!
ముఖ్యమంత్రి సూచించిన వారిచే మంత్రిగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే, రాజకీయం విషయానికి వచ్చే రికి నైతికంగా అది సరికాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారికి మంత్రి పదవి ఇవ్వడాన్ని తెలంగాణ టిడిపి నేతలు రేవంత్ రెడ్డి తదితరులు పలుమార్లు ప్రశ్నించారు.
టిడిపి నుంచి గెలిచిన తలసాని వంటి వారికి కేబినెట్లో ఎలా చోటు కల్పిస్తారని ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రశ్నించారు. ఇదే విషయమై రేవంత్ రెడ్డి కోర్టు గడప తొక్కారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు.
అయితే, టిడిపి నుంచి గెలిచిన తలసానికి మంత్రి పదవి కట్టబెట్టే విషయమై తెరాస నుంచి సరైన సమాధానం మాత్రం లేకపోయింది. దీంతో ఓ విధంగా అది ఇరుకున పడిందని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు స్వయంగా చంద్రబాబు.. కేసీఆర్కు ప్రశ్నించేందుకు అవకాశం ఇవ్వబోతున్నారని భావించవచ్చు.
త్వరలో చంద్రబాబు తన కేబినెట్ను పునర్ వ్యవస్థీకరించనున్నారు. గత ఏడాదిగా.. ఇరవై మంది వైసిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. వారిలో ఇద్దరు ముగ్గురికి మంత్రి వర్గంలో చోటు కల్పంచనున్నారు. ఇప్పుడు ఇదే అవకాశం కోసం కేసీఆర్ ఎదురు చూస్తున్నారని అంటున్నారు.
తద్వారా, ఇన్నాళ్లు తమను ప్రశ్నించిన టిడిపికి సరైన కౌంటర్ ఇస్తారని అంటున్నారు. ఇన్నాళ్లు తమను ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు ఏం చేశారని, వైసిపి నుంచి గెలిచిన వారికి ఎలా తన మంత్రివర్గంలో అవకాశం కల్పించారని తెరాస ఎదురు దాడి దిగేందుకు సన్నద్ధమవుతోందని అంటున్నారు. తలసానిని 2014 డిసెంబర్ నెలలో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన రాజీనామా కోసం టిడిపి డిమాండ్ చేస్తోంది.