'కెల్విన్' షాకింగ్ నిజాలు: వినాయక నిమజ్జనంలో 'డ్రగ్స్' తోనే ఊరేగుతారట..
రాజకీయ వర్గాల పిల్లలు, ఇటు ఇండస్ట్రీకి చెందిన కొందరు కొకైన్ తీసుకోవడం స్టేటస్ సింబల్ గా భావిస్తారని అతను పేర్కొనడం గమనార్హం.
హైదరాబాద్: టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం రాజకీయాలకూ అంటుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కస్టడీలో కెల్విన్ లింకులపై పోలీసులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మరీ విచారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'కొకైన్' డ్రగ్ గురించి కెల్విన్ వెల్లడించిన విషయాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.
డ్రగ్స్ కేసు: రహస్య ప్రదేశంలో విచారణ, కెల్విన్ ఫోన్ లో సీక్రెట్ ఫోల్డర్, డీ కోడింగ్
రాజకీయ వర్గాల పిల్లలు, ఇటు ఇండస్ట్రీకి చెందిన కొందరు కొకైన్ తీసుకోవడం స్టేటస్ సింబల్ గా భావిస్తారని అతను పేర్కొనడం గమనార్హం. అంతేకాదు 'మీరు పట్టుకున్నది ఎల్ఎస్డి డ్రగ్ సప్లై చేసే బ్యాచ్ ను మాత్రమే.. బయట కొకైన్ బ్యాచ్ కూడా ఉంది. అందులో సినీ-రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉన్నారు' అని కెల్విన్ విచారణలో తెలిపినట్లు తెలుస్తోంది.
దాటవేసిన కెల్విన్:
కెల్విన్ కు ఎవరెవరు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు? ఎక్కడినుంచి ఈ నెట్ వర్క్ రన్ అవుతోంది?.. ఎవరికి చేరుతోంది?.. వంటి ప్రశ్నలపై పోలీసులు కెల్విన్ ను విచారించారు. అయితే కెల్విన్ మాత్రం చాలావాటికి దాటవేత ధోరణితో మిడిమిడి సమాధానాలే చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు తమదైన శైలిలో విచారించి పలు కీలక విషయాలను రాబట్టగలిగినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఓ ప్రముఖ దర్శకుడి పేరు ప్రధానంగా వినిపిస్తుండటం గమనార్హం.
Recommended Video
జీషన్ అలీఖాన్ గ్యాంగ్:
ఇండస్ట్రీకి కొకైన్ సప్లయ్ చేస్తున్నది 'జీషన్ అలీఖాన్' అనే గ్యాంగ్ అని కెల్విన్ విచారణలో వెల్లడించాడు. సినీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు నిర్మాతల కొడుకులు, మరో ఇద్దరు నిర్మాతల కొడుకులు, ఓ రాజకీయ ప్రముఖుడి కొడుకు జీషద్ గ్యాంగ్ వద్ద కొకైన్ కస్టమర్లుగా ఉన్నట్లు సమాచారం. జీషన్ గ్యాంగ్ తో పాటు మరికొన్ని గ్యాంగులు కూడా కొకైన్ సరఫరా చేస్తున్నాయని, జీషన్ ను పట్టుకుని విచారిస్తే.. అసలు నిజాలు బయటపడుతాయని కెల్విన్ చెప్పినట్లు తెలుస్తోంది.
వారం క్రితమే జీషన్ విచారణ:
కెల్విన్ జీషన్ పేరు వెల్లడించడం కన్నా వారం ముందే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జీషన్ ను విచారించారు. వారం క్రితం ఓ స్టార్ హోటల్ సమీపంలో కొకైన్ డ్రగ్ విక్రయిస్తున్న అతన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారం వల్లే సినీ పరిశ్రమకు చెందిన ఏడుగురు వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలనుకున్నారు.
కానీ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం.. కేవలం సహనిందితుడు ఇచ్చిన సమాచారం మేరకే నోటీసులు ఇవ్వలేమని, ఒకవేళ ఇచ్చినా కోర్టులో నిలబడవని నిర్దారించుకుని సిట్ అధికారులు వెనక్కి తగ్గారు. దీంతో జీషన్ను కూడా కస్టడీలోకి తీసుకోవాలని సిట్ అధికారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. జీషన్ బ్యాంకు ఖాతాలు, ఫోన్ డేటా తదితర వివరాలను విశ్లేషిస్తే మరిన్ని వివరాలు బయటపడుతాయని భావిస్తున్నారు.
భారీ డిమాండ్:
సాధారణ సమయాల్లో కంటే వినాయక నిమజ్జనం సమయంలో నగరంలో డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉంటుందని కెల్విన్ విచారణలో పేర్కొనడం గమనార్హం. చివరి నాలుగైదు రోజులు డ్రగ్స్ కు భారీ డిమాండ్ ఉంటుందని అతను చెప్పాడు. బ్రెండెన్, నిఖిల్శెట్టి, అమన్ నాయుడు డ్రగ్ ముఠాల నెట్ వర్క్ లతో తనకు లింకులున్నాయని, తామంతా ఎల్ఎస్డీ డ్రగ్స్నే విక్రయిస్తామని కెల్విన్ తెలిపినట్లు తెలుస్తోంది.
సాధారణ రోజుల్లో రోజుకు 500 ఎల్ఎస్డీ స్ట్రిప్పులు, వీకెండ్లో మాత్రం 1500 వరకు , ఇక వినాయక నిమజ్జనం సమయంలో అంతకుమించి విక్రయాలు జరుపుతానని కెల్విన్ తెలిపాడు. నిమజ్జన ఊరేగింపు సమయంలో శరీరంలో గంటల కొద్ది శక్తి ఉండేందుకు చాలామంది డ్రగ్స్ తీసుకుంటారని అతను చెప్పాడు.
డార్క్ నెట్ వర్క్ ద్వారా జర్మనీ, నెదర్లాండ్స్ దేశాల నుంచి ఎక్కువ మొత్తం డ్రగ్స్ తెప్పించి నిల్వ చేస్తామని చెప్పుకొచ్చాడు. తానూ డ్రగ్స్ తీసుకుంటానని, నెలాఖరున గోవా వెళ్లి గడుపుతానని చెప్పినట్లు సమాచారం.