చలించిపోయే దృశ్యం : గుక్కెడు నీటికోసం..
ఖమ్మం : తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో నీటి అవసరాల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవి లేకపోవడంతో తెలంగాణలోని పల్లెలు దాహాంతో అలమటిస్తున్నాయి. గొంతు తడపడానికి గుక్కెడు నీళ్లు లేక గ్రామీణ జనం అల్లాడుతున్నారు. నాలుగైదు మైళ్ల దూరం వెళ్లి.. ప్రాణాలకు తెగిస్తే గానీ దాహాం తీరని దయనీయ పరిస్థితి ఖమ్మం జిల్లా తండాలను వెంటాడుతోంది.
సహకరించని ప్రకృతిని నిందించి లాభం లేదు. పట్టించుకోవాల్సిన అధికారులైనా అటువైపు తొంగిచూడకపోవడం.. పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది. ఖమ్మం జిల్లా కేంద్రానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా..! ఆ తండాల దాహార్తిని మాత్రం పట్టించుకున్న నాథుడు లేడు.
రఘునాథపాలెం మండలం మల్లేపల్లి పంచాయతీ పరిధిలోని రాములుతండా,గడ్డికుంటతండా, బావోజి తండా, పరికలబోడు తండాల్లో గుక్కెడు నీళ్ళు కోసం అక్కడి గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు అక్కడి 10 తండాలకు కలిపి ఉన్న నీటి ఆధారం ఒకే ఒక్క ఊటబావి. అది కూడా నాలుగైదు మైళ్ల దూరంలో, మండుటెండల్లో అంతదూరం వెళ్లినా..! నీటిని చేదడానికి ప్రాణాలకు తెగించి సాహసం చేయాల్సిందే.
రాములు తండాలోని ప్రజల దాహార్తిని తీర్చడానికి జ్యోతి అనే మహిళే అక్కడి గిరిజనులందరికీ దిక్కయింది. బావి లోపలికి దిగడానికి ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు లేకపోయినా..! ఎంతో నేర్పుతో 40 అడుగుల లోతున్న ఆ బావిలోకి దిగి అక్కడి ప్రజలకు నీటిని చేది పోస్తోంది. ఇలా మరికొంతమంది ప్రాణాలకు తెగించి బావిలోకి దిగి నీటిని చేదుకుంటున్నారు.
మల్లేపల్లి పంచాయితీ పరిధిలో రక్షిత మంచినీటి సరఫరా పథకం సరిగా అమలవడం లేదన్న ఆరోపణలున్నాయి. రక్షిత మంచినీటి ద్వారా వచ్చే నీరు తాగడానికి ఉపయోగపడడంలేదని చెప్తున్నారు అక్కడి గ్రామస్తులు. దీంతో రాములు తండాలోని నల్లకుంట బావిలో ఉన్న చిన్న నీటి ఊటనే అక్కడి ప్రజల జీవనాధారంగా మారింది.
కాగా, పది తండాలకు పైగా ప్రజల దాహార్తిని తీరుస్తున్న ఈ ఊటబావిలో పూడిక తీయిస్తే, నీటిమట్టం పెరిగి కొంతవరకు ఇబ్బందులు తప్పవచ్చని అంటున్నారు అక్కడి గిరిజనం.