నిజామాబాద్ జిల్లాలో మొక్క నాటిన కిరణ్ కుమార్ రెడ్డి, మీడియాతో నో!
నిజామాబాద్: సమైక్యాంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడలేదు.
ఆదివారం ఉదయం ఆయన నిజామాబాద్ జిల్లాలోని నర్సింగపల్లిలో గల ఇందూరు తిరుమల ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. ఆలయ పూజారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. అయితే, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన ఒకింత మీడియాకు దూరంగానే ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం జరిగిన గోదావరి పుష్కరాల నేపథ్యంలో విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ కూడా కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించిన విషయం తెలిసిందే.
ఏపీ విభజన సమయంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీగా లగడపాటి రాజగోపాల్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ విభజనకు మొగ్గు చూపడంతో కిరణ్ కాంగ్రెస్ పార్టీని వీడి జై సమైక్యాంధ్ర పార్టీని పెట్టారు.