కెసిఆర్పై కిషన్ ఫైర్: బాబుకు డిఎస్ కితాబు
హైదరాబాద్: తెలంగాణలో రైతులు ఆత్మహత్యలపై సమాచారం లేదని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనడం బాధాకరమని కె. చంద్రశేఖర రావుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణను ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారని ఆయన శనివారం మీడియా సమావేశంలో విమర్శించారు. సీఎంలను తిట్టడం వల్ల తెలంగాణ సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు.
ఏపీ ప్రభుత్వం తప్పు చేసిందని భావిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేసీఆర్ ఎందుకు చర్చలు జరపరని ప్రశ్నించారు. తెలంగాణ సమస్యలను పక్కదోవ పట్టించడానికే విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సమస్యలపై ఇరు రాష్ర్టాల సీఎంలు కలిసి చర్చించాలని సూచించారు. కేసీఆర్ డిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
కెసిఆర్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. విద్యుత్తు సమస్యపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే అఖిల పక్షాన్ని గవర్నర్ వద్దకు తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన సూచించారు. మీడియాలో ప్రకటనలు గుప్పిస్తే సమస్యలు పరిష్కారం కావని కిషన్ రెడ్డి అన్నారు. వెంటనే రైతు సమస్యలు పరిష్కరించి, ఆత్మహత్యలను నిలువరించాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
వచ్చే మూడేళ్ల పాటు రాష్ట్రంలో విద్యుత్తు ఉండదని ముఖ్యమంత్రే చెబుతున్నారని, చత్తీస్గడ్ ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్తు ఇవ్వడానికి ముందుకు వచ్చినా ఎందుకు స్పందించలేదని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత డి. శ్రీనివాస్ కితాబు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రంలో విద్యుత్తు సమస్యను అధిగమించారని ఆయన శనివారం మీడియాతో అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తాము తెలంగాణను కోరుకున్నామని ఆయన చెప్పారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆయన కెసిఆర్ను తప్పు పట్టారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలపైనా ఎపి ముఖ్యమంత్రి ఆలోచించాలని ఆయన సూచించారు. తెలంగాణలో కూడా టిడిపి ఉందని చంద్రబాబు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. చంద్రబాబు, కెసిఆర్ కొట్లాట మాని పరస్పరం సహకరించుకోవాలని ఆయన సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తికి చంద్రబాబు సహకరించాలని ఆయన కోరారు.
పనులు కావాలంటే తెరాసలో చేరాలని ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. మా రాష్ట్రం మా పాలన కోవాలని తెలంగాణ తెచ్చుకుంటే తెరాస ప్రభుత్వం తల కొట్టుకునేలా చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కరెంట్ సమస్యకు కాంగ్రెసు కారణమమనడం సరి కాదని ఆయన అన్నారు. గాంధీ కుటుంబానికి ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. గాంధీ వారసత్వాన్ని కోరుకుంది నాయకులు కాదని, ప్రజలేనని ఆయన అన్నారు.