పవన్ కళ్యాణ్ ఇష్టపడితే పోటీకి జనసేనను ఆహ్వానిస్తాం: కిషన్ రెడ్డి
తిరుపతి/ నల్లగొండ/ హైదరాబాద్: సినీ హీరో పవన్ కళ్యాణ్ ఇష్టపడితే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో జనసేనను పోటీకి ఆహ్వానిస్తామని బిజెపి తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు
జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం పార్టీల కూటమిదే విజయమని ఆయన అన్నారు. చట్టసభల్లో ప్రజాప్రతినిధులు సంయమనంతో వ్యవహరించాలని ఆయన ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చోటు చేసుకున్న సంఘటనలపై స్పందిస్తూ అన్నారు.
విజయంపై ఉత్తమ్ ధీమా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా హుజూర్నగర్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ టీఆర్ఎస్కు బలం లేకపోయినా అధికార దాహంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు.
ఈ రోజు రెండు పండుగలు
దేశంలో ఈరోజు రెండు పండుగలు జరుగుతున్నాయని ఒకటి వాజ్పేయి బర్త్ డే, రెండు క్రిస్మస్ అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన వాజ్పేయి 91వ జన్మదిన వేడుకలకు దత్తాత్రేయ హాజరయ్యారు.
దేశంలో రాజకీయాలు వ్యాపార రంగు పులుముకున్నాయన్నారు. హైదరాబాద్ మెట్రో పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్ మెట్రోకు వాజ్పేయి హయాంలోనే రూపకల్పన జరిగిందని దత్తాత్రేయ తెలిపారు.