కోదండరాం అరెస్ట్: కౌడిపల్లిలో ఉద్రిక్తత
నిజామాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అమరవీరుల స్ఫూర్తి యాత్ర చేపట్టేందుకు వెళ్తున్న సమయంలో తుప్రాన్ మండలం అల్లాపూర్ టోల్గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఆయన్ని కౌడిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న జేఏసీ కార్యకర్తలు కౌడిపల్లి పోలీస్ స్టేషన్కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వెంటనే కోదండరాంను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మీడియాను సైతం స్టేషన్లోకి అనుమతించకపోవడంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.
అమరవీరుల స్ఫూర్తి యాత్రపై ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు మెదక్ జిల్లా ఏఎస్పీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి అల్లాపూర్ టోల్గేట్ వద్ద తనిఖీలు చేపట్టారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కోదండరాం యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
కాగా, అంతుకుముందు హైదరాబాద్లో కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. అమరవీరుల స్ఫూర్తి యాత్రకు జిల్లా ఎస్పీ అనుమతి ఇవ్వకపోవడంతో నిజామాబాద్లో టౌన్ హాల్ మీటింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. శుక్రవారం కూడా కోదండరాం యాత్రను టీఆర్ఎస్ నేతలు, పలువురు రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే.