కార్పొరేట్, కాంట్రాక్టర్ల పాలన కోరుకోవడం లేదు: కోదండరాం
వరంగల్: రాష్ట్ర ప్రజలు కార్పొరేట్, కాంట్రాక్టర్ల పాలన కోరుకోవట్లేదని, ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వ పాలన ఉండాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం హన్మకొండ కిషన్పురలోని వాగ్దేవి కళాశాల సెమినార్హాల్లో తెలంగాణ విద్యావంతుల వేదిక సమావేశం నిర్వహించారు.
జూన్ 3, 4 తేదీల్లో జిల్లాలో తెలంగాణ విద్యావంతుల వేదిక 6వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్న నేపథ్యంలో.. టీవీవీ ఐకాస నేత గురిజాల రవీందర్ అధ్యక్షతన మహాసభకు సంబంధించిన సన్నాహాక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. గత పాలకుల మాదిరిగానే రాష్ట్రంలో పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కాకుండా నూతన రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, యువత, విద్య, వైద్యం అన్ని వర్గాల అభివృద్ధి ఫలాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు.
'రాష్ట్ర సభల్లో భాగంగా నూతన రాష్ట్రంలో మూడేళ్ల ప్రభుత్వ పాలన ఎలా ఉంది..పాలన ఎలా ఉంటే బాగుండేది. .భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది' అనే అంశాలపై విస్తృతస్థాయి చర్చలు నిర్వహిస్తామన్నారు. గురిజాల రవీందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సామాజిక తెలంగాణ-ప్రజాస్వామిక తెలంగాణ రావాలన్నారు.
రాష్ట్రంలో సమస్యలపై ప్రశ్నించే వారిపై నిర్బంధాలు తప్పితే.. ప్రజల చైతన్యం మేరకు పాలన సాగడంలేదన్నారు. నూతన రాష్ట్రంలోని మూడేళ్ల పాలనలో 'ఒక విజయం-మరో ఉదయం' ఎక్కడా కనిపించలేదన్నారు. సమావేశంలో ఐకాస నేతలు రఘుతోపాటు ప్రొఫెసర్లు జ్యోతిరాణి, గిరిజారాణి, విజయలక్ష్మి, హరిప్రరసాద్, రమాదేవితోపాటు సిరాజుద్దీన్, దళితరత్న బొమ్మల కట్టయ్య, డాక్టర్ అశోక్రెడ్డి, అంబటి శ్రీనివాస్, డాక్టర్ జగదీశ్వర్, చిల్లా రాజేంద్రప్రసాద్, సదాలక్ష్మి, డాక్టర్ చంద్రభాను తదితరులు ప్రసంగించారు. దీనికి ముందు కోదండరాంతో కలిసి నేతలు పూలే చిత్రపటం వద్ద నివాళులర్పించారు.