‘ఉద్యమాలు నేర్పుతున్నది ప్రభుత్వమే, అందుకే విద్యార్థులు రోడ్లపైకి’
విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు వెళ్లి ఉజ్వలమైన భవిష్యత్ను పొందాల్సిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమై, రోడ్లు ఎక్కి ధర్నాలు, ఉద్యమాలు చేయడం నేర్పుతోందని టీజేఏసీ.
సంగారెడ్డి: విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు వెళ్లి ఉజ్వలమైన భవిష్యత్ను పొందాల్సిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమై, రోడ్లు ఎక్కి ధర్నాలు, ఉద్యమాలు చేయడం నేర్పుతోందని టీజేఏసీ రాష్ట్ర చైర్మన్ కోదండరాం విమర్శించారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కొన్ని రోజులుగా వ్యవసాయ ఇంజినీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కలెక్టరేట్ వద్ద నిరవధిక నిరాహారదీక్షను చేపట్టారు. గురువారం శిబిరానికి వచ్చిన కోదండరాం విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి చూపలేనప్పుడు విద్యను ఎందుకు ప్రవేశపెట్టిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం రాజకీయాలు నేర్పుతుందని ఎద్దేవా చేశారు.
ధర్నాలు చేయడానికి ఏ విధంగా అనుమతులు పొందాలి, ఏ విధంగా మంత్రిని కలిసి తమ పని చేసుకోవాలనే విషయాలను నేర్పుతుందన్నారు. మన తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉద్యమాల్లో పాల్గొన్నవారిని ప్రభుత్వం రోడ్డుపాలు చేయడం దారుణమన్నారు.