సర్వే చేశా, నివేదిక ఉంది: కెసిఆర్కు కోదండ షాక్, హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు షాకివ్వనున్నారా? అనే చర్చ ఎప్పటి నుంచో సాగుతోంది. తాజాగా, రైతు ఆత్మహత్యల విషయంలో ఆయన ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. దీంతో, మళ్లీ కోదండరాం చర్చనీయాంశమయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పెరుగుతున్న రైతు ఆత్మహత్యల పైన ఆచార్య కోదండరామ్ మంగళవారం నాడు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఆత్మహత్యలను ప్రోత్సహించేలా ప్రభుత్వం విధానాలు ఉన్నాయని, స్వామినాథన్ కమిటీ నివేదికను పట్టించుకోవడం లేదని ఆయన తన పిటిషన్లోపేర్కొన్నారు.
తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున కోదండరామ్ ఈ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల క్రితం వ్యవసాయ జన చైతన్య సమితి రైతు ఆత్మహత్యల పైన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తీరు రైతు ఆత్మహత్యలను ప్రోత్సహించేలా ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
ప్రభుత్వం చర్యలు తీసుకోనందు వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని అందులో వ్యవసాయ జన చైతన్య సమితి పేర్కొంది. దీనిపై న్యాయస్థానం ఈ రోజు విచారించవలసి ఉంది. అయితే, కోదండరామ్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన కోదండరామ్ తన పిటిషన్లో... రైతు ఆత్మహత్యలు పెరిగాయని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందని, దీని పైన తాను సమగ్ర సర్వే జరిపానని, ఇందుకు సంబంధించి తన వద్ద నివేదిక ఉందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.