రాజకీయ ప్రవేశం, పార్టీ స్థాపన: తేల్చేసిన కోదండరాం
రాజకీయాల్లోకి రావడంపై తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. సందర్భం, అవసరం వస్తే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతామని కోదండరాం అన్నారు.
హైదరాబాద్: రాజకీయాల్లోకి రావడంపై తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. సందర్భం, అవసరం వస్తే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతామని కోదండరాం అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఒక వేళ పార్టీ పెట్టాల్సిన అవసరం, సందర్భం వస్తే తప్పకుండా పెడతామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినా.. జేఏసీ మాత్రం కొనసాగుతుందని అన్నారు. సమాజంలో విలువలతో కూడిన రాజకీయ పార్టీల అవసరం ఉందని, ప్రత్యామ్నాయ రాజకీయ విలువల కోసం జేఏసీ పోరాడుతోందని కోదండరాం చెప్పారు.
జోనల్ వ్యవస్థ రద్దు చేస్తే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, రద్దు చేయకుండా దాన్ని సవరించాలని అన్నారు. ఫిబ్రవరి 22న తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరుద్యోగుల ర్యాలీ శాంతియుతంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
ఎవరూ ఆవేశపడొద్దని, జేఏసీని బద్నామ్ చేయడానికి కొందరు కాచుకుని కూర్చున్నారని.. గొడవలు, కాల్పులు జరిపేందుకు కూడా సిద్ధమైనట్లు కోదండరాం తెలిపారు. ర్యాలీ శాంతియుతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.