వెంకయ్య మాటలు ఆందోళనకరం: కోదండరామ్
మహబూబ్నగర్: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో మార్పులు అవసరమంటూ కేంద్రమంత్రి ఎం. వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. రాష్ట్ర విభజనను మొదటినుంచీ ఆయన వ్యతిరేకించారని, చివరకు రాజ్యసభలో కూడా తెలంగాణ బిల్లును అడ్డుకున్నారని ఆరోపించారు. మహబూబ్నగర్లో సోమవారం నిర్వహించిన తెలంగాణ పాఠశాలల స్వీపర్ల సంఘం జిల్లా సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు.
విభజన చట్టంలో మార్పులంటూ జరిగితే తెలంగాణ అభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రానికిసంపూర్ణ అధికారాలు కావాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల ప్రజలు తాము తెలంగాణాలోనే ఉంటామని ఎంత చెప్పినా పట్టించుకోకుండా, వారిని ఏపీలో విలీనం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడంలో వెంకయ్యనాయుడిదే ముఖ్యపాత్ర అని అన్నారు.
కాగా, స్వీపర్లకు నెలకు కేవలం 1600 రూపాయలు మాత్రమే ఇవ్వడం అన్యాయమన్నారు. స్వీపర్లంతా ఐక్యంగా ఉంటే వారి న్యాయపరమైన డిమాండ్లు నెరవేరుతాయని, వారి సమస్యలను సీఎం, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళతానని ఆయన హామీ ఇచ్చారు. పోరాటాలతోనే సమస్యలు పరిష్కరమవుతాయని ఆయన చెప్పారు. పాఠశాలల్లో పని చేసే స్వీపర్లకు పనికి తగిన వేతనం అందడం లేదని, నెలకు రూ.1623 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. అది కూడా వారికి ఆరేడు నెలల కోసారి అందుతోందని తెలిపారు. దీంతో వీరి జీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు.
స్వీపర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 1,547 మంది స్వీపర్లు క్రమబద్దీకరణకు అర్హులు కాగా, ఉద్యోగ విరమణకు ఆరు నెల్ల ముందు 123 మందిని రెగ్యులరైజ్ చేసి గత ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. టీఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ మాట్లాడుతూ స్వీపర్లందరినీ రెగ్యులరైజ్ చేయాలని, నెల సరి కనీస వేతనం రూ.12,500 చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో స్వీపర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు, కార్యదర్శి గట్టన్న, నాయకులు చంద్రాములు, బందెప్ప, ఎండీ షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.