కేసు వల్లే సెక్షన్ 8 తెరపైకి, శాంతిభద్రతలు మెరుగు: కోదండరామ్
మహబూబ్నగర్/ వరంగల్/ హైదరాబాద్: రెండు రాష్ట్రాల్లో ప్రజలు శాంతియుతంగా ఉన్నారని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. గతంలో కంటే హైదరాబాద్లో శాంతిభద్రతలు మెరుగయ్యాయని తెలిపారు.
ఓటుకు నోటు కేసు వల్లే సెక్షన్-8 తెరపైకి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. సొంత ప్రయోజనాల కోసం హైదరాబాద్పై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని కోదండరాం విమర్శించారు. గురువారం ఆయన మహబూబ్నగర్లో మీడియాతో మాట్లాడారు.
విభజన సమయంలో సెక్షన్ 8 గురించి ఇద్దరు ముఖ్యమంత్రులకు తెలియదా అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన గురువారం వరంగల్లో ఆరోపించారు. టెలిఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెప్పే దమ్ము, ధైర్యం కేసీఆర్కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుతో ఇద్దరు చంద్రులు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ఇదిలావుంటే, ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి బెయిల్ రావాలని హైదరాబాదులోని వనస్థలిపురం ప్రశాంతినగర్ సాయిబాబా ఆలయంలో టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు.