హడావుడిగా వద్దు, చూశాకే: కెసిఆర్కు కోదండ షాక్, యెన్నం ఫైర్
హైదరాబాద్: ప్రభుత్వం హడావుడిగా కాకుండా అన్నింటిని పరిశీలించాకనే జీవోలు విడుదల చేయాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ సోమవారం నాడు అన్నారు. 135వ జీవో రద్దు చేసి అన్ని దేవాలయాల ఉద్యోగులకు ఒకే చట్టం అమలు చేయాలన్నారు.
సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ అర్చక, ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండరామ్ హాజరై.. ప్రభుత్వాన్ని పైవిధంగా డిమాండ్ చేశారు.
టిఆర్ఎస్పై పోరాటానికే బచావో తెలంగాణ: యెన్నం
తెలంగాణ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన పోరాడేందుకే బచావో తెలంగాణ ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత యెన్నం శ్రీనివాస్ రెడ్డి సోమవారం చెప్పారు.
ప్రభుత్వం పైన పోరాడాటానికే తెలంగాణ బచావో మిషన్ అన్నారు. కేసీఆర్కు పండుగలు, శంకుస్థాపనలు తప్ప ప్రజా సమస్యలను ఏనాడు పట్టించుకున్నది లేదన్నారు. అసలు గ్రామజ్యోతి కార్యక్రమం ఎందుకు పెట్టారో ప్రభుత్వానికే తెలియదన్నారు.
అంతకంటే ముందు ప్రారంభించిన మన ఊరు - ప్రణాళికను ఎందుకు పట్టించుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో 10 శాతం మొక్కలు కూడా నాటలేదన్నారు.
అసెంబ్లీని సమావేశపర్చండి: డాక్టర్ కె లక్ష్మణ్
ప్రజా సమస్యలను చర్చించేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంత్రిత్వ శాఖ బలోపేతం కోసమే గ్రామజ్యోతి అని ఎద్దేవా చేశారు.