'కోదండరాం పార్టీ పెట్టరు, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వం'
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పార్టీ పెడతారని తాము అనుకోవడం లేదని, కొత్తగా రాజకీయాలలోకి వచ్చే వారు ఆయనను బలవంతం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పార్టీ పెడతారని తాము అనుకోవడం లేదని, కొత్తగా రాజకీయాలలోకి వచ్చే వారు ఆయనను బలవంతం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు అన్నారు.
తెలంగాణలో జేఏసీ బలహీనపడకుండా తాము మద్దతు తెలుపుతున్నామనిచెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వారికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. అందుకే తాము తమ్మినేని వీరభద్రం పాదయాత్రకు మద్దతిచ్చామన్నారు.
గత ఎన్నికలలో తాము యువత ఓట్లు కోల్పోయామని చెప్పారు. యువత మద్దతు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాహుల్ గాంధీతో త్వరలోవిద్యార్థి, నిరుద్యోగ గర్జన నిర్వహిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లలో డీసీసీ అధ్యక్షులకు టిక్కెట్లు ఇవ్వమని చెప్పారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే పార్టీలకు, ప్రజా సంఘాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు బలపడాల్సిన అవసరముందన్నారు.
నల్గొండ జిల్లాలో తమ్మినేనితో కలిసి పాదయాత్రలో పాల్గొంటానని తెలిపారు. పార్టీలో యువతను ప్రోత్సహించాలని రాహుల్ ఆదేశించారని, ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల తర్వాత ఆయన తెలంగాణలో పర్యటిస్తారన్నారు.
విద్యార్థి, యువజన సమస్యలపై ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా విద్యార్థి, యువజన గర్జనసభలో పాల్గొంటారన్నారు. తమ పార్టీ హయాంలో ప్రకటించిన ఐటీఐఆర్ రాబట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ విషయమై కేసీఆర్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.