రేవంత్ రెడ్డికి షాక్: టీఆర్ఎస్లో చేరిన కొడంగల్ ఎంపీపీ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. తాజాగా శుక్రవారం రేవంత్ నియోజక వర్గమైన కొడంగల్ ఎంపీపీ దయాకర్రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. దయాకర్రెడ్డితో పాటు టీడీపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
మంత్రి లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు నిరంజన్రెడ్డి వీరందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరు జిల్లా వెనకేయబడిందని పేర్కొన్నారు.
ఇప్పుడు అందరం కలిసి బంగారు తెలంగాణను పుననిర్మించుకోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నాగం జనార్ధన్రెడ్డి తన రాజకీయ భవిష్యత్ను కాపాడుకోవడం కోసమే బచావో తెలంగాణ మిషన్ ఏర్పాటు చేసుకున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
జర్నలిస్టులు, డ్రైవర్లు, హోంగార్డులకు ప్రమాద బీమా
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులు, ప్రైవేటు డ్రైవర్లు, హోంగార్డులకు ప్రమాద బీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టులు, ప్రైవేటు డ్రైవర్లు, హోంగార్డులకు రూ. 5 లక్షల బీమా ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.
ప్రమాద బీమా ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. 22-08-2015 నుంచి ప్రమాద బీమా వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రమాద బీమాతో 10 లక్షల డ్రైవర్లు, 10 వేల మంది జర్నలిస్టులు లబ్ధి పొందుతారని తెలిపారు. ప్రమాద బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించడంతో జర్నలిస్టులు, హోంగార్డులు, డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.