‘‘ఏం మాట్లాడాలో తెలియకే అలా, ఎక్కువసార్లు కలిసింది ఆయనే , పైరవీలు సాగకే ఇలా..’’
సచివాలయంలో చీఫ్ సెక్రటరీని కలిసిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఏం మాట్లాడాలో తెలియక అనవసర ఆరోపణలు చేశారన్నారని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సచివాలయంలో చీఫ్ సెక్రటరీని కలిసిన తరువాత ఏం మాట్లాడాలో తెలియక అనవసర ఆరోపణలు చేశారని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి కర్నె ప్రభాకర్ అన్నారు.
టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు తక్కువగా ఇస్తున్నారనే ఆరోపణలు అవాస్తమన్నారు. సీఎంను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదని చెప్పటం హాస్యస్పదమని తెలిపారు.
కాంగ్రెస్ నేతల్లో సీఎం కేసీఆర్ ను ఎక్కువ సార్లు కలిసింది కోమటిరెడ్డేనని స్పష్టం చేశారు. ఆయన తరుపున ఇప్పటికే దాదాపుగా 391 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు ఇచ్చినట్లు కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతలు దశాబ్దాలుగా పైరవీలకు అలవాటు పడ్డారని, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పైరపీలకు తావులేకపోవడంతో సతమతమవుతున్నారని ఎద్దేవా చేశారు.
అంతేకాదు, కాంగ్రెస్ నేతలు తెలుగు కూడా మర్చిపోయారు. వారికి ఢిల్లీ భాష మాత్రమే గుర్తుందని, అందుకే కేసీఆర్ భాషపై విమర్శలు చేస్తున్నారని ప్రభాకర్ మండిపడ్డారు. కోమటి రెడ్డి గతంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు చేసిందేమీ లేదని విమర్శించారు.
కేటీఆర్ అమెరికా టూర్పై విమర్శలు చేయటం తగదని, కేటీఆర్ 5 సార్లు అమెరికా వెళ్లటం వల్లే అనేక ఐటీ కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ నేతలకు స్కాంలు మాత్రమే తెలుసునని.. స్కీమ్ ల గురించి తెలియదని, అందుకే చివరికి గొర్రెల పంపణీలో కూడా స్కాం ఉందని ఆరోపిస్తున్నారని విమర్శించారు.