నేను డబ్బిస్తున్నా, టెక్కీలు మీరూ ఆదుకోండి: కోమటిరెడ్డి, కిషన్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్/వరంగల్: అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సాఫ్టువేర్ ఉద్యోగులు.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం అన్నారు.
తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు కొందరికి తాను ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.50వేల చొప్పున ఇస్తానని ప్రకటించారు. మెదక్, నల్గొండ జిల్లా రైతులకు తాను ఆర్థిక సాయం చేస్తానని చెప్పారు. ప్రభుత్వం, సాఫ్టువేర్ ఇంజనీర్లు కూడా ముందుకు రావాలని కోరారు.
అప్పుల పాలైన రైతులకు ప్రభుత్వం అండదండగా ఉండాలన్నారు. ఉద్యోగులు ఒక్కరోజు వేతనాన్ని ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల కోసం ఇచ్చేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ఆపదలో ఉన్న రైతులను ఆదుకోండి: పొంగులేటి
ఆపదలో ఉన్న రైతులను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని టిడిపి నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
కిషన్ రెడ్డి అరెస్టు
వరంగల్ జిల్లాలో బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న కిషన్ రెడ్డిని, బిజెపి నాయకులను అరెస్టు చేశారు. అంతకుముందు కిషన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ ప్రభుత్వం దినోత్సవాన్ని జరపకపోయినా బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు నోరు మెదపటం లేదన్నారు. వరంగల్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మజ్లిస్ నిజాం వారసత్వ పార్టీ అన్నారు.