కొండా సురేఖ హ్యాపీ: ఒకే ఒక్కడు.. కెసిఆర్కు కొండా మురళీ ప్రశంసలు
వరంగల్: వరంగల్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ నేత కొండా మురళి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ప్రజాదరణ కలిగి ఉన్న నేత కేసీఆర్ ఒక్కరే అన్నారు.
కెసిఆర్ నాయకత్వంలో పని చేయడం వల్లే తాను ఏకగ్రీవంగా ఎన్నిక కాగలిగానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల వ్యక్తిగా తనకు అందరూ అండగా నిలిచారన్నారు. వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు, టీఆర్ఎస్ పార్టీకి వరంగల్ జిల్లా ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. వరంగల్ కార్పోరేషన్లో టీఆర్ఎస్ను ఢీకొనే పరిస్థితుల్లో ప్రతిపక్షాలు లేవని చెప్పారు. ఇప్పటికైనా వారు విమర్శలు మాని, ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కలసి రావాలన్నారు.
కాగా, 2014 ఎన్నికలకు ముందు తెరాసలో చేరిన కొండా సురేఖ.. ఆ తర్వాత కొద్ది రోజులు అధినేత పైన అసంతృప్తిగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి.
తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం, తన భర్త కొండా మురళీకి ఇస్తానని చెప్పిన ఎమ్మెల్సీ పదవిని ఇవ్వకపోవడంపై ఆమె అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొండా మురళీకి అవకాశం ఇవ్వడం, పైగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో కొండా సురేఖ సంతృప్తి చెంది ఉంటారని అంటున్నారు.
మా బాధ్యత మరింత పెరిగింది: కడియం
వరుస గెలుపులతో టీఆర్ఎస్ పార్టీ నేతలు గానీ, కార్యకర్తలు గానీ పొంగిపోవడం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గెలుపుతో తమ పార్టీపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. వరంగల్ జిల్లా అభివృద్దికి సీఎం కట్టుబడి ఉన్నారన్నారు. కలిసికట్టుగా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామన్నారు.