‘పవన్! మీ అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టి, మంచి ధరకు అమ్మేశారు, నీ సంగతేంటి?’
ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తాన్ని టీమిండియాలా నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు.
సోమవారం కృష్ణసాగర్ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మానసిక సమతుల్యత లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జాతీయ సమగ్రత అనేది బీజేపీ ప్రాథమిక సిద్దాంతమని చెప్పారు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా తమ పార్టీకి లేదని కృష్ణసాగర్ తెలిపారు. సినిమాల్లో మాదిరి ట్విట్టర్లో చిత్ర విచిత్రంగా పోస్టులు పెడుతున్నారంటూ పవన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మీ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి, మంచి ధరకు దాన్ని అమ్మేసుకున్నారు. మరి మీ(పవన్ కళ్యాణ్) జనసేన పరిస్థితి ఏంటీ?' అని కృష్ణసాగర్ ప్రశ్నించారు. ఆధారాలుంటేనే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలని, ఇలాంటి కామెంట్లు రాజకీయ నిరుద్యోగానికి నిదర్శనాలని అన్నారు.
ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన ప్రముఖ సినీ నటుడు చిరంజీవి.. ఆ తర్వాత కొంత కాలానికి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దీంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజ్యసభ ఎంపీని చేసి కేంద్రమంత్రి పదవిని కూడా కట్టబెట్టింది.