నీటి ఘర్షణ: సీఎంలపై గుత్తా, 'ఏపీది దౌర్జన్యం'
హైదారాబాద్: నాగార్జున సాగర్ నీటి వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, శాసనసభాపక్ష నేత జానారెడ్డి స్పందించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నాగార్జున సాగర్ నీటి వివాదంపై కేంద్రం జోక్య చేసుకోని శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు.
కృష్ణా నీటి సమస్యను పరిష్కరించకుండా కేంద్రం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దౌర్జన్యం సరికాదన్నారు.
నాగార్జున సాగర్ డ్యాం వద్ద శుక్రవారం జరిగిన పోలీసుల దాడిని ఆయన ఖండించారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి జానా రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే.
సెంటిమెంట్తో ఇద్దరు సీఎంలూ రాజకీయాలు: గుత్తా
నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఏపీ, తెలంగాణ రాష్ట్ర పోలీసులు మధ్య ఘర్షణకు కారణం సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ అంటూ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.
శనివారం హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ వద్ద పోలీసుల మధ్య గొడవ జరిగితేనే కానీ... ఇద్దరు సీఎంలు చర్చలు జరిపేందుకు ముందుకు రాలేదని విమర్శించారు.
ఎడమ కాల్వ నుంచి నీటిని విడుదల చేయకపోతే 2.50 లక్షల ఎకరాల్లోని పంటలు ఎండిపోతాయని అన్నారు. ఇద్దరూ సీఎంలూ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెడుతూ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. పంటలు ఎండిపోతే ఇద్దరు సీఎంలదే బాధ్యత అని అన్నారు. కృష్ణా రివర్ బోర్డుకు అధికారం ఇచ్చి ఈ సమస్యను త్వరగా పరిష్కరించేలా చూడాలని, కేంద్రానికి గుత్తా సూచించారు.