అమెరికాలో బిజీ బిజీగా కేటీఆర్ : సిస్టర్ సిటీ ఒప్పందంపై ఫోకస్
చికాగో : అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు తెలంగాణ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్. చికాగో విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసుల నుంచి ఆయనకు ఘనస్వాగతం లభించింది. అక్కడి నుంచి నేరుగా భారత కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ కాన్సులేట్ జనరల్ అసఫ్ సయిద్ ను కలుసుకున్నారు.
ఆ తర్వాత ఇల్లినాయిస్ రాష్ర్టం- తెలంగాణ ప్రభుత్వాల మధ్య భవిష్యత్తు సంబంధాలపై ఇల్లినాయిస్ డిప్యూటీ గవర్నర్ ట్రే చిల్డర్స్ తో ఆయన కార్యాలయంలో సమావేశమయి చర్చించారు. ఈ సమావేశానికి కేటీఆర్ వెంట కాన్సులేట్ జనరల్ అసఫ్ సయిద్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఐటీ పాలసీ గురించి ప్రస్తావించిన కేటీఆర్, వ్యాపార రంగానికి సంబంధించి తెలంగాణాలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం తరుపున సంపూర్ణ మద్దతు ఉంటుందని వివరించారు.
అనంతరం, చికాగో నుండి ఇండియానా పొలీస్ వెళ్లిన కేటీఆర్ అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇండియానా పోలీస్ గవర్నర్ మైక్ పెన్స్ తో సమావేశమయిన కేటీఆర్ పలు అభివృద్ది కార్యక్రమాల గురించి చర్చించారు. అలాగే ఇండియానా పోలీస్, హైదరాబాద్ సిస్టర్ సిటీస్ కమ్యూనిటీ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో అక్కడి తెలంగాణ NRIలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్బంగా తెలంగాణ ఫ్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల గురించి అక్కడి NRI లకు వివరించారు. రానున్న రోజుల్లో ఇండియానా పోలీస్ రాష్ర్టంతో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న సిస్టర్ సిటీ ఒప్పందాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు కేటీఆర్. తర్వలోనే హైదరాబాద్ నగర మేయర్ కూడా ఇండియానా పోలీస్ ను సందర్శించి పలు అంశాలను పరిశీలిస్తారని చెప్పుకొచ్చారు.
ఈ సమావేశం అనంతరం జరిగిన మరో తెలంగాణ NRI సమావేశంలోను మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. సమావేశంలో దాదాపు 500 మంది ఎన్నారై పాల్గొన్నట్లుగా సమాచారం. సమావేశంలో మాట్లాడిన ఆయన భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలిపేలా చేస్తామని ప్రకటించారు. తొలి రోజు పర్యటనలో కేటీఆర్ తో పాటుగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ సమావేశాల్లో పాల్గొన్నారు.