ప్రజా జీవితంలో అత్యంత కీలకమిదేనంటున్న కేటీఆర్
హైదరాబాద్: ప్రజా జీవితంలో ఉండే రాజకీయ నాయకులు ఎలా నడుచుకోవాలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కెటి రామారావు తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు. దీంతోపాటు మహిళలతో చర్చిస్తున్న ఫొటోలను కూడా పోస్ట్ చేశారు.
క్షేత్ర స్థాయిలో ఉండే ప్రజలు, ముఖ్యంగా మహిళలతో ఎటువంటి భేషజాలకు పోకుండా, వారితో మమేకం కావాల్సి వుందని తెలిపారు. ప్రజా జీవితంలో ఇదే అత్యంత ప్రధానమని పేర్కొన్నారు.
Best part of public life is freewheeling interaction with the men & women at the grassroots pic.twitter.com/nyoRL5FBP2
— KTR (@KTRTRS) 2 May 2016
కాగా, కేటీఆర్ ఇప్పటికే పలు పురస్కారాలను అందుకున్న సంగతి తెలిసిందే. 2015 సంవత్సరానికి గాను 'స్కాచ్ ఛాలెంజర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుతో పాటు 'మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్' గానూ కెటిఆర్ గుర్తింపు తెచ్చుకున్నారు.
అనైతిక పొత్తులతో టీఆర్ఎస్ గెలుపును ఆపలేరు: కేటీఆర్
అనైతిక పొత్తులతో పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్రావుకు మద్దతుగా మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావులు నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పాలేరు ఉపఎన్నికలో కాంగ్రెస్, టీడీపీలు అనైతిక పొత్తులు పెట్టుకున్నాయన్నారు. ఈ పొత్తులతో టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయశక్తిగా మారబోతుందన్నారు.
పాలేరు ఉప ఎన్నికలో మంత్రి తుమ్మలను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. తలాపునే పాలేరు రిజర్వాయర్ ఉన్నా కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాలకు సాగునీరు అందటంలేదని చెప్పారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకంతో భూములను సస్యశ్యామలం చేయబోతున్నామని వివరించారు. ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఈ ఉప ఎన్నికలో ప్రజలు ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయాలని కెటిఆర్ కోరారు.