ఆ విషయంపై కేటీఆర్ క్లారిటీ!: రాజకీయ జీవితమంతా అక్కడినుంచే..
తన రాజకీయ జీవితం ఉన్నంతవరకు తాను సిరిసిల్లలోనే పోటీ చేస్తానని స్పష్టతనిచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలతో సిరిసిల్లకు ఆయనకు గుడ్ బై చెబుతున్నారన్న వార్తలకు చెక్ పెట్టినట్లయింది.
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకుని గులాబీ దళాన్ని గుబాళించేలా చేసిన కేటీఆర్.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచే బరిలో దిగబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. తన రాజకీయ జీవితం ఉన్నంతవరకు తాను సిరిసిల్లలోనే పోటీ చేస్తానని స్పష్టతనిచ్చారు.
కేటీఆర్ వ్యాఖ్యలతో సిరిసిల్లకు ఆయనకు గుడ్ బై చెబుతున్నారన్న వార్తలకు చెక్ పెట్టినట్లయింది.తాజాగా సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. జిల్లా అభివృద్ధిపై పుస్తకాన్ని బుధవారం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ మార్పుపై స్పందించారు. సిరిసిల్ల నేతన్నలను వదిలి.. తాను వేరే నియోజకవర్గానికి వెళ్లే అవకాశం లేదన్నారు.
సిరిసిల్ల నేతన్నల అభివృద్ది కోసం రూ.200కోట్ల ఆర్డర్స్ వారికి ఇచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో నేతన్నలు ఆత్మగౌరవంతో బతికేలా చేస్తానని తెలిపారు. చేనేత జౌలి శాఖకు బడ్జెట్ లో రూ.1200కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా.. దాదాపు 40లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఇందుకోసం ఏటా రూ.5300కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలియజేశారు.
వచ్చే ఏడాది నుంచి రైతులకు 24గం. విద్యుత్ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సిరిసిల్లను అన్ని రంగాల్లోను అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేస్తానని అన్నారు. వచ్చే రెండేళ్లలో జిల్లావ్యాప్తంగా సీసీ రోడ్లు వేస్తామని హామి ఇచ్చారు.